Telangana: 600 సిమ్ కార్డులు.. కోట్లలో మోసాలు.. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కామ్ గుట్టు రట్టు..
భారతీయ సిమ్ కార్డులను అక్రమంగా సరిహద్దులు దాటించి, అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్న ఒక భారీ నెట్వర్క్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బట్టబయలు చేసింది. అమాయకుల గుర్తింపు పత్రాలతో సిమ్ కార్డులు సేకరించి, వాటిని కంబోడియాలోని మోసగాళ్ల సిండికేట్కు చేరుస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న విస్తుపోయే నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా సామాన్యుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న అంతర్జాతీయ సైబర్ మోసాల వెనుక ఉన్న ఒక భారీ నెట్వర్క్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. భారతీయ సిమ్ కార్డులను అక్రమంగా కంబోడియాకు తరలిస్తూ, అక్కడ కూర్చుని భారతీయులనే దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 31న శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగిన తనిఖీల్లో ఈ ముఠా భాగోతం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సయ్యద్ అష్రఫ్ అలీ తన లగేజీలో అత్యంత రహస్యంగా దాచిన 198 భారతీయ సిమ్ కార్డులతో కంబోడియా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అతడిని లోతుగా విచారించడంతో ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో బయటపడింది.
600 సిమ్ కార్డులు.. కోట్ల రూపాయల మోసం
2023 నుంచి ఇప్పటివరకు ఈ ముఠా సుమారు 600కు పైగా భారతీయ సిమ్ కార్డులను కంబోడియాకు చేరవేసింది. ఈ కార్డులను ఉపయోగించి అక్కడి సిండికేట్లు ఫిషింగ్ కాల్స్, నకిలీ బెదిరింపులు, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి నేరాలకు పాల్పడుతున్నాయి. దీనివల్ల భారతీయ బాధితులు ఇప్పటికే కోట్ల రూపాయల మేర నష్టపోయారని పోలీసులు భావిస్తున్నారు.
ముఠా పనితీరు
ఈ ముఠాకు ఉత్తరప్రదేశ్కు చెందిన రిజ్వాన్ నాయకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లోని లోకల్ ఏజెంట్ల ద్వారా సిమ్ కార్డులను సేకరించడం ఇతడి పని. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు ఎయిర్టెల్, జియో వంటి కంపెనీల పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. వీరు కావాలనే అమాయకుల పేర్ల మీద లేదా నకిలీ పత్రాలతో సిమ్ కార్డులను యాక్టివేట్ చేసి ఈ ముఠాకు అందిస్తున్నారు. ‘‘ఇది ఒక చిన్న ముఠా కాదు. భారత్, విదేశాల మధ్య పనిచేస్తున్న అనేక గ్రూప్స్ ఉన్న నెట్వర్క్. ఈ అక్రమ సిమ్ కార్డుల వల్ల నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతోంది’’ అని పోలీసులు తెలిపారు.
ప్రజలకు సైబర్ బ్యూరో హెచ్చరికలు
మీ ప్రమేయం లేకుండానే మీ పేరు మీద నేరాలు జరగకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించండి:
- ఆధార్ వంటి వ్యక్తిగత పత్రాలను ఎవరికీ అజాగ్రత్తగా ఇవ్వకండి.
- మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి వెంటనే Sanchar Saathi వెబ్సైట్ను తనిఖీ చేయండి.
- మీకు తెలియని నంబర్లు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయండి.
కాగా ప్రస్తుతం పరారీలో ఉన్న కొరియర్ ఏజెంట్ అరవింద్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
