Telangana: రేషన్ కార్డుదారులకు ఉగాది కానుక.. ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ
తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ.. చరిత్ర సృష్టించబోతోంది. రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ వేదికగా ప్రారంభించనున్నారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనికోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హుజూర్నగర్కు చేరుకుంటారు. అక్కడ ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీ నిర్మాణం జరుగుతోంది. ఆ పనులను సీఎం రేవంత్ పరిశీలిస్తారు. ఆ తర్వాత నేరుగా బహిరంగ సభాస్థలికి చేరుకొని రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుడతారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతోంది.
ఇక ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డుబియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. ఈ స్థాయిలో బియ్యం కావాలంటే 36 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా.. 2.81 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.