Telangana Politics: ఖమ్మం గుమ్మంలో అడుగుపెడుతున్న భట్టి.. పాదయాత్రకు స్వాగతం పలికేందకు రెడీ అవుతున్న కాంగ్రెస్ శ్రేణులు
ఓవైపు భట్టి పాదయాత్ర ముగింపు, మరోవైపు రాహుల్ గాంధీ సభ.. ఇంతకన్నా ఏం కావాలి? హస్తం పార్టీకి ఇదో పెద్దపండుగ. ఈ జాతర జరుపుకోవడానికి ఖమ్మం గుమ్మం వైపుకు పయనమవుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఖమ్మం కోటను కాంగ్రెస్ పార్టీ చుట్టుముట్టింది. అటు యాత్ర, ఇటు సభ ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం..

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు.. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఖమ్మంలోకి భట్టి అడుగుపెట్టడం.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అడుగడుగునా స్వాగతం పలుకుతున్న జనసందోహం.. మరోవైపు సభ కోసం ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల మధ్య భట్టి అడుగులు వేశారు. శ్రీ శ్రీ సర్కిల్ వరకు యాత్ర సాగింది. అక్కడ నుంచి ఆదివారం మద్యాహ్నం పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు సీఎల్పీ లీడర్.
1350 కిలోమీటర్ల మేర పీపుల్స్ మార్చ్ సాగింది. 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 750 గ్రామాల్లో కొనసాగిన ఈ పాదయాత్రతో పార్టీ గ్రాఫ్ పెరిగినట్టు కాంగ్రెస్ భావిస్తోంది. పాదయాత్రలో ఇబ్బందులు పెట్టినట్టే.. సభకు జనం రాకుండా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయనీ.. అయినా స్వచ్ఛందంగా ప్రజలు వస్తారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డితో పాటు మరికొంత మంది నాయకులు పార్టీలో చేరబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మీటింగ్ తర్వాత కూడా భారీ ఎత్తున చేరికలు ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఈ సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా కీలక ప్రకటనలు ఉండబోతున్నాయా..? అనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ మాజీ ఇన్చార్జ్ సెక్రెటరీ, ప్రస్తుత కర్ణాటక మంత్రి అయిన బోసురాజుతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్ది రోజులుగా కర్నాటక వేదికగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా ఖమ్మం సభతో కాంగ్రెస్లో సరికొత్త ఉత్సాహం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
