రెండు గంటల పాటు సాగిన ఇద్దరు సీఎంల భేటీ.. సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్..!
హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పదేళ్లుగా పరిష్కారం కాని విభజన హామీలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజా భవన్లో సమవేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు.

హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పదేళ్లుగా పరిష్కారం కాని విభజన హామీలు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజా భవన్లో సమవేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. మరోసారి భేటీ కావాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు వీలుగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా భద్రాచలం నుండి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని 5 గ్రామాలను తమకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. భద్రాచలం పట్టణానికి అనుకుని ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను..తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఈ గ్రామాల విలీనంతో భద్రాచలం పట్టణ అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెబుతోంది. అయితే ఓ రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే.. కేంద్ర అనుమతి తప్పనిసరి. కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.
ప్రజాభవన్ భేటీలో విభజన సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేశారు ఇరువురు ముఖ్యమంత్రులు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడకుండా ఉమ్మడి అజెండాపై కలిసిపని చేయాలని రెండు రాష్ట్రాలు మొదటి నుంచి భావిస్తున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని, ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడేలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు.
ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తైనా కూడా.. అనేక కీలకాంశాలు ఇంకాపెండింగ్లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా తొమ్మిది ఎజెండా అంశాలను ఖరారు చేశారు. ఈ ఎజెండాలో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలో చేర్చని సంస్థల ఆస్తుల పంపకాలు, ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్తు బిల్లులు, విదేశీ రుణ సాయంతో నిర్మించిన ప్రాజెక్టుల ఆస్తులు-అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన చెల్లింపులు, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాలపై చర్చించారు.
ముఖ్యమంత్రులో భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్థన్రెడ్డి పాల్గొనగా, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
