Revanth Cabinet: శ్రావణ పల్లకీలో విహరిస్తున్న నేతలు.. రేవంత్ మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి?!

శ్రావణ మాసం వస్తోంది. ఆశల పల్లకి తెస్తోంది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి? మరికొద్ది రోజుల్లో సీట్‌ న్యూస్‌ అందుకునేదెవరు? 6 బెర్తుల్లో ఒకటైనా దక్కకపోతుందా అనే ఆలోచనతో లాబీయింగ్‌ చేసుకుంటున్న ఆశావహులెవరో చూద్దాం..!

Revanth Cabinet: శ్రావణ పల్లకీలో విహరిస్తున్న నేతలు.. రేవంత్ మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి?!
Revanth Reddy Bhatti
Follow us

|

Updated on: Jul 31, 2024 | 6:05 AM

శ్రావణ మాసం వస్తోంది. ఆశల పల్లకి తెస్తోంది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి? మరికొద్ది రోజుల్లో సీట్‌ న్యూస్‌ అందుకునేదెవరు? 6 బెర్తుల్లో ఒకటైనా దక్కకపోతుందా అనే ఆలోచనతో లాబీయింగ్‌ చేసుకుంటున్న ఆశావహులెవరో చూద్దాం.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆషాఢం ముగిసి…శ్రావణ మాసం వస్తుండడంతో..ఉందీలే మంత్రీ కాలం ముందు ముందునా అని పాడుకుంటున్నారు. రేవంత్‌ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే సీఎం రేవంత్‌ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్‌ సీనియర్లు కూడా హస్తినకు వెళ్లడంతో.. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే కూడికలు తీసివేతలు ఓ కొలిక్కి రాలేదో ఏమో గానీ.. ఆషాఢం ఆశలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. శ్రావణంలో మంత్రి వర్గం విస్తరణ చేద్దాం, అప్పుడే చూద్దాం అని అధిష్టానం చెప్పడంతో ఈ ఆశలకు టెంపరరీగా కామా పడింది.

అయితే ఇప్పుడు శ్రావణ మాసం ముంచుకొస్తున్న శుభ ముహూర్తాన ఆశావహుల్లో మళ్లీ కదలిక మొదలైంది. మంత్రివర్గ బెర్తులపై కర్చీఫులు వేయడం మొదలైంది. మొన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్‌, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, నకిరేకల్‌ శాసనసభ్యుడు వేముల వీరేశం, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు… సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటూ సీఎం దృష్టిలో పడ్డారు.

ఇక లేటెస్ట్‌గా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 34 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ తరఫున గెలిచింది తాను ఒక్కడినే కాబట్టి, మంత్రివర్గం విస్తరణలో తనకు అవకాశం వస్తుందంటున్నారు ఆయన. మూడు సార్లు గెలిచిన సీనియర్‌ కావడంతో, ఆషాఢం తర్వాత అవకాశం ఉంటుందని ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా తనకు చాన్స్‌ ఉంటుందని నమ్ముతున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌.. ఎస్టీ కోటాలో కర్చీఫ్‌ వేసుకుని కూర్చున్నారు. ఆశావహుల జాబితాలో బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే, మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత గడ్డం వివేక్‌ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో ఎంపీగా కూడా పనిచేశారు.

మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ స్వయంగా ప్రకటించడం.. శ్రీహరికి కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు పేరు కూడా ఆశావహుల జాబితాలో ఉంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే 6 బెర్తులు ఖాళీగా ఉన్నా…ప్రస్తుతం ఐదుగురిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, మైనారిటీ కోటాను తర్వాత భర్తీ చేస్తారని చెబుతున్నారు.

ఇలా పలువురు ఆశావహులు…శ్రావణ పల్లకీలో విహరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…