Bandi Sanjay: ‘ముందస్తు’ సన్నాహాలు.. తెలంగాణలో ప్లాన్ మార్చిన బీజేపీ.. బస్సు యాత్ర ఆలోచనలో బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు బండి. అదే జరిగితే తాను చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా పూర్తవడం కష్టం. దీంతో బస్సు యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? బీజేపీ మాత్రం అందుకు తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా పాదయాత్ర వ్యూహాలు మార్చుకునేందుకు రెడీ అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఒక్కసారి అధికారం ఇవ్వండంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ప్రత్యర్థులతో తలపడేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నాయకులను రెడీ చేస్తున్నారాయన. అందులో భాగంగా తన పాదయాత్ర విషయంలోను ప్లాన్B సిద్ధం చేసుకుంటున్నారు. ఎస్, కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు బండి. అదే జరిగితే తాను చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా పూర్తవడం కష్టం. దీంతో బస్సు యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. అప్పుడే.. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయొచ్చని భావిస్తున్నారు. ప్రజా సంగ్రామ పాదయాత్రలో సైతం వేగం పెంచుతున్నారు బండి సంజయ్. నిర్మల్ జిల్లాలో సాగుతున్న పాదయాత్ర పూర్తవగానే హైదరాబాద్లో చేపట్టబోతున్నారు. కేవలం పది రోజుల్లో భాగ్యనగరాన్ని చుట్టేసేలా గ్రేటర్ రూట్మ్యాప్ సైతం ఖరారైపోయింది.
మరోవైపు.. తన పాదయాత్రలో సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బండి సంజయ్. సెంటిమెంట్నూ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారాయన. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే.. స్థానిక సమస్యలనూ టచ్ చేస్తున్నారు. మంత్రులకు, జిల్లాస్థాయి అధికారులకూ వార్నింగ్ ఇస్తూ.. డెడ్లైన్లు పెడుతూ లక్ష్యం దిశగా వెళ్తున్నారు బండి సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..