Niranjan Reddy Letter: తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమం మొదలయిందే ముఖ్యంగా నీళ్ల కోసమని మంత్రి గుర్తు చేశారు.
Telangana Minister Niranjan Reddy Letter: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమం మొదలయిందే ముఖ్యంగా నీళ్ల కోసమని మంత్రి గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయ సాగు చేసే పరిస్థితుల నుంచి చెరువులు, కుంటలు మత్తలు దూకేలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగామన్నారు. వానలు రాక, కరంటు లేక, సాగు నీరు అందక నిత్యం యుద్దం చేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక ఒడిదుడుకుల అనంతరం 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో సాగుభూమి ఏళ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు. కేసీఆర్ విధానాలతో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని స్పష్టం చేశారు. 2020-21 నాటికి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. కేంద్ర మంత్రులు పార్లమెంట్లో తలోమాట చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇంకో మాట చెప్తున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్లో ఇతర పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలతో సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యవసాయానికి దూరమయిన రైతాంగానికి సాగునీరు అందించడం ఒక్కటే సమస్య పరిష్కారానికి మార్గం కాదని కేసీఆర్ గారు భావించారు. రైతులకు ఆత్మస్థయిర్యం కల్పించి ధైర్యంగా వ్యవసాయం చేసేందుకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. సాగు నీరు అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. పంట పెట్టుబడి కోసం రైతు వడ్డీ వ్యాపారుల ముందు చేయిచాచకుండా ఉండేందుకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు అందించే రైతుబంధు పథకం, వ్యవసాయమే జీవితంగా జీవిస్తున్న రైతు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించేలా రైతు భీమా పథకం, పంటల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సమితుల ఏర్పాటు, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి 2601 రైతువేదికల నిర్మాణం, ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకంతో పాటు సమైక్య రాష్ట్రంలో మాదిరిగా రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా వాటిని అందుబాటులో ఉంచడం, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేసి, గోదాముల నిర్మాణం చేసి వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీనిమూలంగా గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. ఏడేళ్ల క్రితం ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణ అన్నపూర్ణగా మారింది. తిండిగింజలకు తండ్లాడిన తెలంగాణ ధాన్యపురాశులతో కళకళలాడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఈ విజయం సాధ్యమయింది.
తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ పూర్తి సారాంశం..Minister Niranjan Reddy Letter