Singareni Strike: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణిలో మోగిన సమ్మె సైరన్.. ఎప్పటి నుంచంటే..?
సింగరేణిలో సమ్మె సైరన్ మోగించింది కార్మిక సంఘం. బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికార గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి బోర్డు యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది.
Singareni Workers Strike: సింగరేణిలో సమ్మె సైరన్ మోగించింది కార్మిక సంఘం. బొగ్గు గనుల్లోని బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికార గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సింగరేణి బోర్డు యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. ఇటీవల కేంద్రప్రభుత్వం నాలగు బొగ్గు గనులను వేలం ద్వారా ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని టీబీజీకేఎస్ ప్రకటించింది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని సింగరేణి కార్మికులు స్పష్టం చేశారు. కల్యాణ్ ఖని బ్లాక్ -6, కోయగూడెం బ్లాక్ -3, సత్తుపల్లి బ్లాక్ -3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. ఆ నాలుగు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి సమ్మె చేపట్టాలని టీబీజీకేఎస్ నిర్ణయం తీసుకుంది. కోల్ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాగా ప్రైవేటీకరణతో కార్మికులకు రావాల్సిన వారసత్వ ఉద్యోగాల్లో కోత, లాభాల్లో వాటాలు కూడా కనుమరుగవుతాయని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యైటింక్లైన్ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లాల కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. రెండు పేర్లు ఉన్న సింగరేణి కార్మికుల డిపెండెంట్స్కు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాలన్నారు. కరోనా కారణంగా మెడికల్ బోర్డు నిలిచిపోయిన దరిమిలా 35 సంవత్సరాలు దాటిన డిపెండెంట్స్ కు ఉద్యోగాలు కల్పించాలని, 35 సంవత్సరాల వయో పరిమితిని 40 సంవత్సరాలకు పెంచి వన్ టైం మేజర్ గా డిపెండెంట్లందరికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులైనా కూడా డిపెండెంట్లకు కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also…. MLC Elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల జోరు.. మరోసారి గులాబీదే హవా!