AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సారు… నా కోడి పోయింది అంటూ పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఫిర్యాదు.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..?

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో కోడి దొంగతనం ఒక సినిమాలా సాగింది. ఇంటి వద్ద ఉన్న ప్రత్యేక బ్రీడ్‌ కోడిని బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు దొంగిలించడంతో బాధితుడు గోపాల్‌ పోలీసులను ఆశ్రయించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌తో నిందితులను గుర్తించి స్థానికుల సహాయంతో పట్టుకున్నాడు. తర్వాత..

Telangana: సారు... నా కోడి పోయింది అంటూ పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి ఫిర్యాదు.. చివర్లో ట్విస్ట్ ఏంటంటే..?
Rooster Theft
Boorugu Shiva Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 19, 2025 | 6:54 PM

Share

తన కోడి దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అంతేకాదు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలను సైతం వారికి అందించాడు. మహబూబ్‌ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాలలో గోపాల్ అనే వ్యక్తి.. గొర్రెలను మోపుతూ జీవనం సాగిస్తున్నారు. అదనపు ఆదాయం కింద ప్రత్యేక బ్రీడ్ కలిగిన కోళ్లను పెంచుకుంటున్నాడు. పెంచిన కోళ్లు నిర్ణీత బరువుకు చేరుకోగానే వాటిని అమ్మేవాడు. అయితే శనివారం గోపాల్ ఆయన భార్య గొర్రెలను మేపేందుకు వెళ్లగా ఇంటి వద్ద కూతురును కాపలా ఉంచారు. ఇక దంపతులు సాయంత్రం ఇంటికి రాగానే.. కూతురు షాకింగ్ విషయం చెప్పింది. మధ్యాహ్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఓ కోడిని ఎత్తుకెళ్లారని తెలిపింది. తనను బెదిరించి ఈ చోరికి పాల్పడ్డారని వివరించింది. దీంతో వెంటనే సీసీ కెమెరాల ఫుటేజ్‌ని పరిశీలించాడు గోపాల్. ఇద్దరు వ్యక్తులు కూమార్తెను బెదిరించి కోడిని దొంగిలించడం రికార్డయింది. వెంటనే జడ్చర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఇక గోపాల్ అందించిన వివరాలతో పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దొంగిలించిన కోడిని అదే ప్రాంతంలో అమ్మకానికి పెట్టారు. విషయాన్ని గమనించిన స్థానిక యువకులు గోపాల్‌కు సమాచారం అందించారు. ఇక అక్కడికి వెళ్లిన గోపాల్.. స్థానికుల సహాయంతో వారిని పట్టుకున్నాడు. దొంగిలించిన తన కోడితో పాటు, వారి స్కూటీని పీఎస్‌కు తీసుకెళ్లాడు. దీంతో నిందితులకు చేసిన తప్పు తెలిసొచ్చింది. తమను వదిలేయాలని వేడుకున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయని బాధితుడి కాళ్లావేళ్లా పడ్డారు. దీంతో కనికరించిన గోపాల్ వారిని వదిలేయాలని పోలీసులను కోరాడు. పోలీసులు సైతం ఇద్దరు నిందితులకు చివాట్లు పెట్టీ తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇక స్వాధీనం చేసుకున్న కోడిని గోపాల్‌కు ఇచ్చేశారు.

ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు కోడి దొంగతనం ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ వేసారు. బాధితుడు కోడితో సహా పీఎస్‌లో అటు, ఇటు తీరుగుతుండడంతో కాసేపు అందరూ ఆసక్తిగా తిలకించారు.