AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: కరోనాతో చతికిల పడ్డ ఆర్టీసీ గట్టెక్కాలంటే చార్జీలు పెంచక తప్పదు.. సీఎంకు విన్నవించిన అధికారులు.

CM KCR: ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌, మరోవైపు పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ కారణంగా ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతోందని, ఆర్టీసీని..

CM KCR: కరోనాతో చతికిల పడ్డ ఆర్టీసీ గట్టెక్కాలంటే చార్జీలు పెంచక తప్పదు.. సీఎంకు విన్నవించిన అధికారులు.
Narender Vaitla
|

Updated on: Sep 21, 2021 | 11:24 PM

Share

CM KCR: ఓవైపు కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌, మరోవైపు పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ కారణంగా ఆర్టీసీ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతోందని, ఆర్టీసీని సంక్షోభం నుంచి ఆదుకోవాలని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎంను కలిసిన వీరు పలు ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందు ఉంచారు. అధికారులు, మంత్రి చెప్పిన విషయాలన్నింటినీ విన్న కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేళ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాలమీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న సమయంలోనే కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఆర్టీసీ తిరిగి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడం బాధాకరమని సీఎం అన్నారు. అన్ని రకాల చర్యలు చేపట్టి ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

ఈ ఉన్నత సాయి సమావేశంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మేల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ప్రిసిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో డీజీల్ ధరలు లీటరుకు రూ. 22 రూపాయలు పెరగడం కారణంగా ఆర్టీసీపై రూ. 550 కోట్లు అదనపు ఆర్ధిక భారం పడుతుందని అధికారులు సీఎంకు ఈ సందర్భంగా వివరించారు. డీజిల్‌తో పాటు టైర్లు ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగడం కూడా సంస్థను నష్టాల్లోకి నెడుతుందన్నారు. దీంతో రూ. 600 కోట్ల ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోయాల్సి వస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్టీసీ రూ. 3000 కోట్ల ఆదాయాన్ని నష్ట పోయిందని అధికారులు సీఎంకు వివరించారు. ఒక్క హైద్రాబాద్ పరిధిలోనే నెలకు రూ.90 కోట్ల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు.

చార్జీలు పెంచక తప్పదు..

ఇటువంటి కష్ట కాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయనీ.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన ఆవశ్యకతను సీఎంకు వివరించారు. ఇదిలా ఉంటే గత మార్చి 2020 అసెంబ్లీలోనే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటిందని, కాగా కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి తెలిపారు. చార్జీలు పెంచుకోవడానికి తమకు అనుమతిస్తే తప్ప కరోనానంతర పరిస్థితుల్లోంచి, పెరిగిన డీజిల్ ధరల ప్రభావం నుంచి బయటపడి భవిష్యత్తులో ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అధికారులు సీఎంకు స్పష్టం చేశారు.

నష్టాల్లోంచి బయటపడేందుకు చార్జీలు పెంచడం సహా ఇతర ఆదాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉందని వారు తెలిపారు. ఇక అధికారుల విన్నపాన్ని విన్న ముఖ్యమంత్రి.. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశం ముందుకు రావాలని, అందులో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

Also Read: Crime News: దారుణం.. దొంగతనం చేశాడంటూ వ్యక్తికి గుండు కొట్టించిన ఊరి జనం. అవమానాన్ని భరించలేక అతను..

Yuvraj Singh: ఆరు బంతులకు ఆరు సిక్సులు.. ఆ అద్భత ఘట్టాన్ని మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపిన యూవీ. వైరల్‌ వీడియో..

Cardamom: యాలకుల పెంపకంతో లక్షలు సంపాదించవచ్చు..! సాగు ఎలా చేయాలో తెలుసుకోండి..

Follow Us