Revanth Reddy: ఆరుగురు కాదు.. తొమ్మిది మంది..! మంత్రుల ప్రమాణంపై ఠాక్రేతో రేవంత్ రెడ్డి చర్చలు..
తెలంగాణ సీఎంగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. అనంతరం హైదరాబాద్ వచ్చేందుకు తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం.. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో వెంటనే వెనుదిరిగారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో భేటీ అయ్యారు.
తెలంగాణ సీఎంగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. అనంతరం హైదరాబాద్ వచ్చేందుకు తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం.. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో వెంటనే వెనుదిరిగారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ముఖ్యంగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రేపు రేవంత్తోపాటు మరో ఆరుగురు లేదా ఎనిమిది మంది ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధిష్టానం సూచనల ప్రకారం.. కాసేపట్లో బెర్త్ కన్ఫామ్ అయిన వ్యక్తుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.. ఇందుకోసమే రేవంత్ను హైకమాండ్ వెనక్కి పిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు చేరుకున్న రేవంత్.. ఠాక్రేతో చర్చలు జరిపి హైదరాబాద్ బయలుదేరారు. రేవంత్ తోపాటు ఠాక్రే పలువురు నేతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు. మంత్రులుగా ఎవరెవరు ప్రమాణం చేస్తారన్నది తెలియాల్సి ఉంది.
అంతకుముందు రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తన ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ కాంగ్రెస్ పెద్దలందరిని కలిసి స్వయంగా ఆహ్వానించారు రేవంత్. నిన్న రాత్రి ఢిల్లీ వచ్చిన వెంటనే ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ను కలిశారు. దాదాపు అర్థరాత్రి వరకు శివకుమార్తో చర్చలు జరిపారు. మంత్రివర్గ కూర్పు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్కం టాగూర్ను కలిశారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయన నివాసంలో ఉన్నారు.
ఈ ఉదయం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి తొలుత కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. హైదరాబాద్లో రేపటి ప్రమాణస్వీకారానికి రావాలని స్వయంగా ఖర్గేను ఆహ్వానించారు. మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అనంతరం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం టెన్ జన్పథ్కు రేవంత్ రెడ్డి వెళ్లారు. అప్పటికే సోనియా గాంధీ పార్లమెంట్కు వెళ్లడంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంకను కలిశారు. రేపటి ప్రమాణస్వీకారానికి రావాలని వాళ్లిద్దరిని ఆహ్వానించారు. ఆ తర్వాత పార్లమెంట్కు వెళ్లి సోనియా గాంధీని కలిశారు. రేపు హైదరాబాద్ రావాలని కోరారు. పార్లమెంట్ నుంచి బయటకు వచ్చిన సోనియా గాంధీని మీడియా ప్రతినిధులు రేపు హైదరాబాద్ వెళ్తున్నారా అని ప్రశ్నించగా, బహుశా వెళ్తానేమోనని అన్నారు.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. తనతో, సోనియాతో, ప్రియాంకతో రేవంత్ ఉన్న ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకిచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తుందని, ప్రజల సర్కారును నిర్మిస్తుందని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..