AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో కేఏపాల్‌పై ఓ వ్యక్తి ఎటాక్ చేశాడు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి..

KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..
Ka Paul
Sanjay Kasula
|

Updated on: May 02, 2022 | 8:51 PM

Share

ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్‌పై(KA Paul) దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా(Siddipet District) జక్కాపూర్‌లో కేఏపాల్‌పై ఓ వ్యక్తి ఎటాక్ చేశాడు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. డీఎస్పీ సమక్షంలోనే కేఏ పాల్ పై దాడి చేశాడు. సిరిసిల్ల వెళుతుండగా మధ్యలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బస్వాపూర్‌లో రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేఏ పాల్‌ పర్యటనకు అనుమతి లేదని జక్కాపూర్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులతో కేఏ పాల్‌ వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో కేఏ పాల్‌పై చేయిచేసుకున్నాడు ఓ వ్యక్తి. దాడి జరిగిన అనంతరం కేఏపాల్‌కు సర్దిచెప్పి మళ్లీ హైదరాబాద్‌కు పంపించారు పోలీసులు.

కేఏ పాల్.. మత ప్రచారకుడిగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితులే.. ప్రతిసారీ ఎలక్షన్ల ముందు ప్రత్యక్షమయ్యే కేఏ పాల్.. ఈ సారి సంవత్సరం ముందే ఎంట్రీ ఇచ్చారు. వరంగల్‌లో సభ పేరుతో నిన్న హడావుడి చేసిన ఆయన.. ఇవాళ ఏకంగా చెంపదెబ్బ తిని వార్తల్లోకెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ బయలు దేరారు. సిద్ధిపేట జిల్లా జక్కపూర్‌‌లో ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. వారితో మాట్లాడుతుండగానే.. జనంలో నుంచి దూసుకొచ్చిన అనిల్.. పాల్‌పై దాడి చేశాడు.

తనపై జరిగిన దాడికి కేఏ పాల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ సమక్షంలోనే తనపై దాడి జరగడం సిగ్గుచేటన్నారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులే గూండాల్ని తీసుకొచ్చి దాడి చేయించారనేది పాల్ ఆరోపణ.

పాల్‌పై దాడి చేసిన వ్యక్తిది జిల్లెల్ల గ్రామం. సీఎంతో పాటు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేశానంటున్నారు అనిల్. మరోసారి తెలంగాణలో అడుగుపెడితే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు.

కేఏపాల్‌పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామన్నారు సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌. ప్రభుత్వాన్ని, పోలీసులను కేఏ పాల్‌ దూషించినట్టు చెప్తున్నారాయన. లా అండ్‌ ఆర్డర్ సమస్య వస్తుందని.. ముందే చెప్పినా కేఏ పాల్ వినలేదన్నారు.