AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: రాహుల్‌ టీమ్‌ ప్రయత్నాలు ఫుల్ సక్సెస్..! అనుచరులతో సహా కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి..!

పొంగులేటి, జూపల్లితో రాహుల్‌ గాంధీ టీమ్‌ రహస్యంగా సమావేశమై చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలూ తమ వంతు ప్రయత్నం చేశారు. పొంగులేటి, జూపల్లి చేరడమే కాకుండా తమ అనుచరులకు కూడా టికెట్స్‌..

Telangana Politics: రాహుల్‌ టీమ్‌ ప్రయత్నాలు ఫుల్ సక్సెస్..! అనుచరులతో సహా కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి..!
Ponguleti Srinivas Reddy And Jupally Krishna Rao
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2023 | 12:42 PM

Share

కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పొంగులేటిది ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే.. జూపల్లిది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా. ఈ ఇద్దరు నేతలు బీఆర్‌ఎస్‌ నుంచి వేటు వేశారు. అప్పటి నుంచి పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలోకి వెళ్తారు..? వీళ్ల రాజకీయ ప్రయాణం ఏంటి అని విస్తృత చర్చ జరుగుతోంది. ఈ చర్చకు ఎట్టకేలకు ముగింపు పలికే అంశం తెరపైకి వచ్చింది. ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. వీరి చేరికకు కాంగ్రెస్‌లో లైన్‌ క్లియర్‌ అయ్యిందనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులను చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీతోపాటు బీజేపీ నేతలు కూడా ప్రయత్నించారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ వీరితో చర్చించారు కూడా. కానీ.. ఇద్దరు నేతలు తనకు రివర్స్‌ కౌన్సిలింగ్‌ ఇస్తున్నారని ఆ మధ్య ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ వాళ్లు కాంగ్రెస్‌లోకి వెళ్లకుండా ఆపగలిగాను తప్ప వారి మనసు మార్చలేకపోయానన్నది ఈటల కామెంట్.

బీజేపీ నేతల కంటే ముందుగానే కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తం అయ్యింది. పొంగులేటి, జూపల్లితో రాహుల్‌ గాంధీ టీమ్‌ రహస్యంగా సమావేశమై చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలూ తమ వంతు ప్రయత్నం చేశారు. పొంగులేటి, జూపల్లి చేరడమే కాకుండా తమ అనుచరులకు కూడా టికెట్స్‌ ఇవ్వాలన్నది మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ షరతులకు రాహుల్‌ గాంధీ టీమ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లి ఇద్దరికీ టికెట్స్‌ ఇవ్వడంతోపాటు.. వాళ్ల అనుచరులకు టికెట్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం.

బీజేపీలో చేరాలా.. కాంగ్రెస్‌లోకి వెళ్లాలా అని ఆలోచించుకుంటున్న సమయంలోనే కర్నాటక ఎన్నికల ఫలితాలతో పొంగులేటి, జూపల్లి మనసు మారినట్టు తెలుస్తోంది. అప్పటికే అనుచరులతో కలిసి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. వాళ్ల మూడ్‌ ఏంటనేది కూడా తెలుసుకున్నారు. చివరకు వివిధ సమీకరణాలు.. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు.. అనుచరుల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే జైకొట్టినట్టు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం