AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అర్ధరాత్రి తండ్రికి వీడియో పంపిన కొడుకు.. అంతా వచ్చేసరికి..

బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఒక్కరి వ్యసనం.. మొత్తం కుటుంబం పాలిట శాపంగా మారుతుంది.. తాజాగా.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో మృతుడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

Telangana: అర్ధరాత్రి తండ్రికి వీడియో పంపిన కొడుకు.. అంతా వచ్చేసరికి..
Crime News
N Narayana Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Feb 19, 2025 | 11:35 AM

Share

ఆ యువకుడు చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. తన ఆర్థిక స్తోమతకు మించి తండ్రి బాగా చదివించారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఆ యువకుడు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు.. బెటింగ్ లలో పెట్టుబడి పెట్టేందుకు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు. అయినా వాటిలో డబ్బులు రాకపోగా.. ఉన్న డబ్బులు మొత్తం పోయాయి.. అప్పులు ఎక్కువయ్యాయి.. అయితే.. అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన ఎండీ మొహినుద్దీన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు, కుమార్తె.. మొహినుద్దీన్‌ కారు డ్రైవర్‌గా పనిచేసేవారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన కుమారుడు ఎం.డి.అజీజుద్దీన్‌(27)కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

ఉద్యోగం చేస్తూనే అజీజుద్దీన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. అందులో నష్టం రాగా.. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ పెట్టాడు. జీతం డబ్బులతో తీర్చినా ఇంకా మిగిలాయి. గతంలో అప్పులవాళ్లు ఇబ్బంది పెడితే తండ్రి సుమారు రూ.5 లక్షల వరకు తీర్చారు. తిరిగి బెట్టింగ్‌లకు పాల్పడిన అజీజుద్దీన్‌ 22 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అప్పుల వాళ్లు ఒత్తిడి చేయడంతో నాలుగు నెలల కిందట ఉద్యోగం మానేసి ఖమ్మానికి తిరిగొచ్చాడు.

అజీజుద్దీన్ వైఎస్‌ఆర్‌ కాలనీలోని సొంతింట్లో ఉంటుండగా.. తల్లిదండ్రులు, సోదరి రోటరీనగర్‌లో అద్దెకు ఉంటున్నారు. సొంతింటిని అమ్మి అప్పులు తీర్చాలని తండ్రికి చెప్పగా.. అందుకు కొంత సమయం కావాలని ఆయన అన్నారు. అప్పులవాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో నిన్న అర్ధరాత్రి తాను చనిపోతున్నట్లు తండ్రికి అజీజుద్దీన్‌ ఫోన్‌లో వీడియో పంపాడు.

దాన్ని చూసి తల్లిదండ్రులు వచ్చేలోపే అతడు ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని అజీజుద్దీన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు అండగా ఉంటాడునుకున్న కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..