Telangana: ఆ తర్వాతే జాబ్ నోటిఫికేషన్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ నియామకం వెంటనే చేపట్టడంతో పాటు 60 రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించినంతరం దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూతన నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ నియామకం వెంటనే చేపట్టడంతో పాటు 60 రోజుల్లోనే కమిషన్ నివేదిక సమర్పించేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించినంతరం దానికి అనుగుణంగా రాష్ట్రంలో నూతన నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై తమకు అందిన వినతులు, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలవుతున్న తీరు, హర్యానాలో తీసుకుంటున్న చర్యలను ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘంలోని సభ్యులైన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సమావేశంలో వివరించారు.
ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా హైకోర్టు మాజీ న్యాయమూర్తితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు నిర్దేశించారు. ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏకసభ్య కమిషన్కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ను ఆదేశించారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలు, కులాల రీగ్రూపింగ్కు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘానికి అందిన వినతులపైనా సమావేశంలో విశ్లేషించారు. వాటన్నింటిని ఏకసభ్య కమిషన్కు అందజేయాలని నిర్ణయించారు. ఏకసభ్య కమిషన్ క్షేత్ర స్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్కో రోజు పర్యటించేందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వేపై బిహార్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులు వివరించారు. బీసీ సామాజిక, ఆర్థిక కుల సర్వే చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం తమ వద్ద లేనందున, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.