Telangana Lockdown: తెలంగాణ‌లో అంతర్రాష్ట్ర సర్వీసుల‌కు అనుమ‌తి లేదు.. స‌డ‌లింపుల వివ‌రాలు ఇలా ఉన్నాయి

లాక్‌డౌన్​ను మరో 10 రోజుల పాటు పొడిగించింది తెలంగాణ స‌ర్కార్. 2005 విపత్తు నిర్వహణా చట్టానికి లోబడి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జూన్‌ 9 వరకు లాక్‌డౌన్​...

Telangana Lockdown: తెలంగాణ‌లో  అంతర్రాష్ట్ర సర్వీసుల‌కు అనుమ‌తి లేదు.. స‌డ‌లింపుల వివ‌రాలు ఇలా ఉన్నాయి
TSRTC
Follow us

|

Updated on: May 31, 2021 | 6:51 AM

లాక్‌డౌన్​ను మరో 10 రోజుల పాటు పొడిగించింది తెలంగాణ స‌ర్కార్. 2005 విపత్తు నిర్వహణా చట్టానికి లోబడి రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి జూన్‌ 9 వరకు లాక్‌డౌన్​ విధించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు పూర్తి లాక్‌డౌన్ ఉంటుందన్న ప్ర‌భుత్వం… ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సడలింపులు ఉంటాయని… అయితే ఆఫీసులు, షాపులు ఒంటి గంట వరకే మూసివేయాలని స్పష్టం చేసింది. వైద్య-ఆరోగ్య, వ్యవసాయ, అనుబంధ, తయారీ, పారిశుధ్య, ఉపాధిహామీ, నిత్యావసర, ఈ-కామర్స్, సైట్​లోనే నిర్మాణ పనులకు లాక్‌డౌన్​ నుంచి మినహాయింపు ఇచ్చింది.

అంతర్రాష్ట్ర సర్వీసులు నడవవు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాసులు ఉంటేనే అనుమతి ఉంటుందని… సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది. సడలింపుల సమయంలో అన్ని రకాల ప్రజారవాణాకు అనుమతి ఉంటుందని, ప్రైవేట్ ఆపరేటర్లు సహా అంతర్‌ రాష్ట్ర బసు సర్వీసులకు అనుమతి లేదని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, దుకాణాలు ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి వేతనాలు ఇవ్వాలన్న ప్రభుత్వం… ఈ విషయంలో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని పేర‌కొంది. మత, క్రీడా, సాంస్కృతిక, వినోద పరమైన ర్యాలీలు, సమావేశాలపై బ్యాన్ కొనసాగుతుందన్న స‌ర్కార్… పెళ్లిలకు గరిష్టంగా 40 మందికి, అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్ల‌డించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని వైద్య-ఆరోగ్య, పోలీసు, స్థానిక సంస్థలు, అగ్నిమాపక, విద్యుత్, నీటిసరఫరా, పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, వ్యవసాయ, అనుబంధ, పౌరసరఫరాల శాఖలతో పాటు కోవిడ్ విధుల్లో ఉన్న కార్యాలయాలన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తాయని తెలిపింది.  జాతీయ రహదారులు మినహా మిగతా ప్రాంతాల్లోని పెట్రోల్ పంపులు మధ్యాహ్నం ఒంటి గంట వరకే పనిచేయాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం లాంటి కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాలని… హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన వారంతా ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Also Read:  కరోనా నుంచి కోలుకున్న‌ తర్వాత అటాక్ చేస్తోన్న ప్ర‌ధాన జ‌బ్బులు ఇవే – జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో మార్పులు