Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ ప్రాంతాల మీదుగా రూట్ ఫిక్స్.. రైల్వేశాఖ కీలక అప్డేట్..
తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల బడ్జెట్లో రాష్ట్రానికి మూడు బుల్లెట్ రైల్ కారిడార్లను ప్రకటించగా.. దీని వల్ల హైదరాబాద్ రైల్వేలకు మాబ్గా మారనుంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైల్వే లైన్ డీపీఆర్ను సిద్దం చేసింది.

తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ మరో తీపికబురు అందించింది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్దమవ్వగా.. ఇది రైల్వేబోర్డ్కు కూడా అందింది. వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. 130 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ చేపట్టనుండగా.. ఇందుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రైల్వే బోర్డు నుంచి డీపీఆర్కు అనుమతి లభించాక ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఎలైన్మెంట్లో పలు మార్పులు చేశారు. గతంలో 120 కిలోమీటర్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఎలైన్మెంట్ మార్చడంతో 130.28 కిలోమీటర్లకు చేరుకుంది. ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణకు వరంగా మారనుంది.
ఈ ప్రాంతాలకు మహార్ధశ
వికారాబాద్ నుంచి కృష్ణా జంక్షన్ వరకు ఈ కొత్త రైల్వే లైన్ ఉంటుంది. పరిగి, కొడంగల్, మక్తల్, నారాయణపేట వంటి ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ కూడా లభించనుంది. ప్రయాణికులకు సౌకర్యంతో పాటు సరుకు రవాణాకు కూడా ఉపయోగపడనుంది. ధాన్యం ఉత్పత్తులు, సిమెంట్, గ్రానైట్ రవాణాకు ఊతమిస్తుంది. దీని వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. గతంలో ఈ ప్రాజెక్ట్ లాభసాటి కాదని కేంద్రం భావించింది. దీని వల్ల అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి రైల్వేశాఖకు ఒక ప్రతిపాదన పెట్టింది. భూసేకరణ కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని ప్రభుత్వం ప్రొపోజల్ పెట్టింది. దీంతో రైల్వేశాఖ కూడా కొత్త రైల్వే లైన్పై ఇప్పుడు ఆసక్తి చూపిస్తోంది.
భూసేకరణకు ప్రభుత్వం సిద్దం
రైల్వే బోర్డు నుంచి డీపీఆర్కు అనుమతి లభించాక తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సిద్దం చేసుకుంది. దీంతో డీపీఆర్ అనుమతి కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ను అనుమతి లభించనుందని తెలుస్తోంది. ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొత్త రైల్వే లోన్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను రైల్వేశాఖ మంత్రికి తెలిపారు. ఇది పూర్తయితే వెనుకబడిన దక్షిణ తెలంగాణకు లాభం జరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. టేకల్ కోడ్తో స్టోన్ నిక్షేపాలు గుర్తించామని, ఈ మార్గాన్ని అభివృద్ది చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుందని సూచించారు. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా ఈ లైన్ను నిర్మించడం వల్ల రాష్ట్రానికి ఆర్ధికంగా ప్రయోజనం ఉంటుందని వివరించారు.
