బిగ్ షాక్.. ఫ్రీగా వచ్చే 150 ఛానెల్స్ ఇకపై రావు? వాటికి కూడా డబ్బులే?
TRAI కీలక నిర్ణయం వల్ల ఇండియాలో స్మార్ట్ టీవీ ఉచిత ఛానెళ్లకు బ్రేక్ పడే అవకాశం ఉంది. 12.9 కోట్ల మంది స్మార్ట్ టీవీ యూజర్లు ఇప్పుడు యాప్ల ద్వారా ఉచితంగా చూస్తున్న 150కి పైగా ఛానెళ్లకు భవిష్యత్తులో రుసుము చెల్లించాల్సి రావచ్చు.

ఇండియాలో స్మార్ట్ టీవీల వినియోగం గత కొన్ని సంవత్సరాల్లో వేగంగా పెరిగి, టీవీ చూసే విధానాన్నే మార్చేసింది. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్తోనే వందలాది ఉచిత ఛానెళ్లను అందించే యాప్లు వినియోగదారులను ఆకర్షించాయి. అయితే ఇప్పుడు ఈ ఉచిత సేవలకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. TRAI త్వరలో తీసుకోబోయే కీలక నిర్ణయం వల్ల, స్మార్ట్ టీవీల్లో లభించే 150కి పైగా ఉచిత ఛానెళ్లు రుసుము పరిధిలోకి వచ్చే అవకాశముందని సమాచారం.
ప్రస్తుతం దేశంలో 12.9 కోట్లకు పైగా స్మార్ట్ టీవీ వినియోగదారులు ఉన్నారు. వీరిలో చాలా మంది కేబుల్ లేదా డీటిహెచ్ కనెక్షన్ లేకుండానే, యాప్ల ద్వారా ఉచితంగా ఛానెళ్లను వీక్షిస్తున్నారు. ఇది సంప్రదాయ డీటిహెచ్ సేవలకు ప్రత్యామ్నాయంగా మారింది. అయితే డీటిహెచ్, కేబుల్ కంపెనీలు ఛానెళ్లకు రుసుము వసూలు చేస్తూ, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. కానీ స్మార్ట్ టీవీ యాప్ల విషయంలో ఇప్పటివరకు అలాంటి కట్టుబాట్లు లేవు. ఈ అసమానతను సరిచేయడానికి TRAI కొత్త నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. స్మార్ట్ టీవీ యాప్లు కూడా డీటిహెచ్ మాదిరిగానే నియంత్రణలోకి రావాలా లేదా అనే అంశంపై మే 4, 2026న తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే, ఇప్పటివరకు ఉచితంగా లభిస్తున్న కొన్ని ఛానెళ్లకు వినియోగదారులు చెల్లించాల్సి రావచ్చు. అయితే ఈ మార్పు ప్రతి వినియోగదారునిపై సమానంగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మిలీనియల్స్, జెన్ Z తరం ఎక్కువగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి OTT ప్లాట్ఫారమ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉచిత ఛానెళ్ల గురించి తెలియని వినియోగదారులు కూడా ఉన్నారు. మొత్తం మీద ఈ నిర్ణయం అమలైతే భారతదేశంలో టీవీ వినియోగ విధానం మరోసారి మారే అవకాశం ఉంది. ఉచిత సేవలపై ఆధారపడుతున్న వినియోగదారులకు ఇది ఒక కొత్త ఖర్చుగా మారవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
