Gandhi Sarovar: మూసీ తీరంలో గాంధీ సరోవర్.. ఎన్ని కోట్లతో కడుతున్నారంటే?
తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ను ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మూసీ నది పునరుజ్జీవనం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ ఖర్చులు మినహాయించి సుమారు రూ.6,500 కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ, హిమాయత్ సాగర్ నుంచి 9.2 కి.మీ మార్గాలను తొలి విడతో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా మూసీ, ఈసీ నదుల సంగమ ప్రాంతంలో గాంధీ సరోవర్ నిర్మాణ్నాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్లో ఇదే కీలకం కానుంది. ఇక్కడ 100 మీటర్ల ఎత్తైన నిర్మాణంపై 123 అడుగుల భారీ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. అలాగే దీనితో పాటు శాంతి విగ్రహం కూడా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
జాతీయ మ్యూజియం
ఈ ప్రాజెక్ట్లోభాగంగా స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ పాత్ర, ఆయన తత్వంపై జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. గాంధీ సాహిత్యం, పరిశోధనలు, పుస్తకాలతో కూడిన నాలెడ్జ్ హబ్ను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వదేశీ ఉద్యమానికి చిహ్నంగా నిలిచిన గాంధీ చరఖా ఆధారంగా ఖాదీ, చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఎన్జీటీ నుంచి గ్రీన్ సిగ్నల్
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తిరస్కరించింది. పర్యావరణ ఉల్లంఘనలపై సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. నదిలో మురుగునీరు చేరకుండా ఎస్టీపీలు, రిటైనింగ్ వాల్స్, చెక్ డ్యామ్లు నిర్మిస్తున్నారు. నది తీరాల్లో ఘాట్లు, వినోద కేంద్రాలు, ధ్యాన గ్రామాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ నగరానికి కొత్త గుర్తింపు రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
