Minister KTR: ఎందుకు వస్తున్నారో చెప్పాలి.. కమలం నేతలను టార్గెట్ చేసిన గులాబీ దళం..
వచ్చే నెలలో హైదరాబాద్లో జరగబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తోంది గులాబీ దళం. హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధిస్తోంది. ఏం ఇచ్చారని, ఏం ఇస్తున్నారని వస్తున్నారో చెప్పాలని నిలదీస్తోంది. ఈ మధ్యలో అగ్నిపథ్ ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ అగ్గిని రాజేస్తోంది.
వచ్చే నెల మొదట్లో హైదరాబాద్కు రాబోతున్న ప్రధాని మోదీ, బీజేపీ నేతల్ని ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తోంది టీఆర్ఎస్. ఏ మొఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారో చెప్పాలని నిలదీశారు మంత్రి కేటీఆర్. వరదలు వస్తే గుజరాత్కు వెయ్యి కోట్లిచ్చిన మోదీ హైదరాబాద్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎందుకు వస్తున్నారో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు కేటీఆర్. మరోవైపు అగ్నిపథ్పై టీఆర్ఎస్, బీజేపీల మధ్య పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. అగ్నివీరులు బయటకొచ్చి కంటింగ్ చేసుకోవచ్చని చెప్పి యువతని అవమానిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. అంటే వృత్తి పని చేసుకునే వారిని అవమానిస్తారా అని ఎదురు ప్రశ్నించారు డీకె అరుణ.
ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
రాబోయే వారం రోజుల్లో దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు వస్తున్నరట.. వారందరినీ కూకట్పల్లి వేదికగా అడుగుతున్న.. ప్రధానమంత్రి గారు గుజరాత్ రూ.20వేలకోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటరు. ఇంకోకాడికి ఆడో వేలకోట్లతో కార్యక్రమని ప్రకటన చేస్తరు.. మరి అది నిజమో, అబద్ధమో తెల్వదు. మీరు ఇప్పటి వరకు చెప్పిన చాలా మాటలు జుమ్లాలు, ఉత్త డొల్ల మాటలు తప్ప మాటలు తప్ప అందులో విషయం ఉండదు’ అంటూ విమర్శించారు.
రాజకీయం సంగతి ఎలా ఉన్నా హైదరాబాద్ హైటెక్ సిటీ ఐటీ కారిడార్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి తెచ్చింది GHMC. కైత్లాపూర్ ఫ్లైఓవర్ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. దీని వల్ల హైటెక్సిటీ, KPHB, జేఎన్టీయు వైపు ట్రాఫిక్ బాగా తగ్గుతుంది. ఈ ఫ్లైఓవర్ ప్రారంభ సభలోనే బీజేపీ నేతలకు ప్రశ్నలు సంధించారు కేటీఆర్.
తెలంగాణ వార్తల కోసం..