Telangana: ప్రజాకోర్టులో గ్రామస్తుడికి మరణశిక్ష.. అందుకేనంటూ మావోయిస్టుల ప్రకటన..
ప్రజాకోర్టులో ఓ గ్రామస్తుడికి మరణ శిక్ష విధించారు మావోయిస్టులు. పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశ పడి రెండేళ్లుగా ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడనే నెపంతో..
ప్రజాకోర్టులో ఓ గ్రామస్తుడికి మరణ శిక్ష విధించారు మావోయిస్టులు. పోలీసులు ఇచ్చే డబ్బుకు ఆశ పడి రెండేళ్లుగా ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడనే నెపంతో అతనికి ఈ శిక్ష విధించారు మావోయిస్టులు. చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. చత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్ పంచాయతీ కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడి బసంత్ గత రెండు సంవత్సరాలుగా పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రజా కోర్టులో అతన్ని నిలబెట్టి మరణ శిక్ష విధించినట్లు తెలిపారు మావోలు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారి మావోయిస్టులు ఆచూకీ తెలిపేందుకు పోలీసుల వద్ద నుంచి రూ. 10 లక్షలు తీసుకునేందుకు బేరం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. ఆ డబ్బు కోసం పని చేస్తూ మావోయిస్టుల జాడ కోసం ప్రయత్నించాడని లేఖలో మావోలు పేర్కొన్నారు.
ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మావోయిస్టులు. సామాన్య ప్రజల చావులకు ప్రభుత్వాలు, పోలీసులే కారణం అని ఆరోపించారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవోద్యమ గ్రామాలలో ప్రజల అమాయకత్వాన్ని, పేదరికాన్ని అడ్డం పెట్టుకుని యువతను ఇన్ఫార్మర్గా తయారు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను ఇన్ఫార్మర్లుగా మారుస్తూ వారి చావులకు కారణం అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఇందులో భాగంగానే బసంత్కు కూడా డబ్బు ఆశ చూపి ఇన్ఫార్మర్గా నియమించుకున్నారని అన్నారు.
కొత్తపల్లి గ్రామంలోని క మిటీ నాయకుల సమాచారం, పార్టీ సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేశాడని , పోలీసుల మాటలు నమ్మి, వారు ఇచ్చిన డబ్బు తీసుకుని బసంత్ జిత్తుల మారి ఎత్తుగడలను అమలు చేశాడని లేఖలో ఆరోపించారు మావోయిస్టులు. ఇలా మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజా శత్రువుగా బసంత్ మారాడని, పీఎల్జీఏ అతన్ని పట్టుకొచ్చి ప్రజా కోర్టులో విచారించడం జరిగిందన్నారు. ఈ ప్రజా కోర్టులో బసంత్ తాను చేసిన ద్రోహాన్ని అంగీకరించాడని, మెజారిటీ అభిప్రాయం మేరకు అతనికి మరణ శిక్ష విధించడం జరిగిందని తెలిపారు మావోయిస్టులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..