AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భర్త మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌.. చెరువులో తేలిన డెడ్‌ బాడీ! అసలు యవ్వారం ఇదీ..

హత్య, హత్యాయత్నం ఏదైనా ఈ రోజుల్లో కేవలం ఒకే ఒక్క కారణమే కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చులు పెడుతున్నాయి. వద్దని హెచ్చరించినా, పంచాయతీలు పెట్టీ వారించిన ప్రవర్తనలో మార్పులు రావడం లేదు. వెరసి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ లో జరిగిన ఓ వ్యక్తి హత్యకు వివాహేతర సంబంధమే కారణమయ్యింది..

Telangana: భర్త మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్‌.. చెరువులో తేలిన డెడ్‌ బాడీ! అసలు యవ్వారం ఇదీ..
Nagarkurnool Murder Mystery
Srilakshmi C
|

Updated on: Jul 23, 2025 | 8:11 PM

Share

పెద్దకొత్తపల్లి, జులై 23: నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమైన కర్నాటి దామోదర్ గౌడ్ ఆ మరునాడే శవమై కనిపించాడు. ఇదే గ్రామానికి చెందిన బుసిగారి బిచ్చన్న, ఆయన కుమారుడు కుర్మయ్య, మరో వ్యక్తి దామోదర్ గౌడ్ ను దారుణంగా కొట్టి చంపారు. అనంతరం సింగోటం చెరువులో శవాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల మిస్సింగ్ కేసు దర్యాప్తు లో భాగంగా ఈ హత్య కోణం వెలుగులోకి వచ్చింది.

కర్నాటి దామోదర్ గౌడ్, ఆయన భార్య నిర్మల కల్వకోల్ గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన బుసీగారి వెంకటమ్మ అనే మహిళతో గత కొన్నేళ్లుగా దామోదర్ గౌడ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి విషయం వెంకటమ్మ భర్త, కుమారుడికి తెలియడంతో అనేక మార్లు ఇద్దరిని హెచ్చరించారు. గ్రామంలో పరువు పోతోందని ఎన్నో సార్లు వారించిన దామోదర్ గౌడ్, వెంకటమ్మ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఇద్దరిపై నిఘా పెట్టిన తండ్రి, కుమారుడు ఈ బంధాన్ని వదిలించాలని భావించారు.

అయితే ఈ నెల 11వ తేదీన రాత్రి వెంకటమ్మ ఇంటివద్దకు దామోదర్ గౌడ్ రావడాన్ని గమనించిన ఆమె భర్త బిచ్చన్న, కొడుకు కుర్మయ్య ఆగ్రహానికి లోనయ్యారు. వెంకటమ్మ సోదరుడు వెంకటస్వామి తో కలిసి బిచ్చన్న, కుర్మయ్య దామోదర్ గౌడ్ పై దాడి చేశారు. వీరికి వెంకటమ్మ సైతం సహకరించింది. అయితే వీరి దాడిలో గాయపడిన దామోదర్ గౌడ్ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక హత్య ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు పకడ్బంధిగా వ్యవహరించారు. దామోదర్ గౌడ్ మృతదేహాన్ని, అతని టూవీలర్ ఇంటి వద్ద నుంచి దూరంగా పడేయాలని భావించారు. ఇందులో భాగంగా అర్దరాత్రి తర్వాత బిచ్చన్న కు చెందిన ట్రాక్టర్ ఎరువులు చల్లే డ్రమ్ములో దామోదర్ గౌడ్ మృతదేహాన్ని, బైక్ ను సింగోటం చెరువులో పడేసారు. అనంతరం అక్కడి నుంచి పరారైనారు.

ఇవి కూడా చదవండి

అయితే 11వ తేదీ రాత్రి తన భర్త అదృశ్యమైనట్లు రెండు రోజుల తర్వాత దామోదర్ గౌడ్ భార్య నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి భోజనం అనంతరం ఇంటిపైన ఉన్న రూమ్ లో పడుకుంటానని వెళ్ళాడని భార్య తెలిపింది. ఉదయం కిందకు రాకపోవడంతో వెళ్ళి చూడగా తలుపులు తెరుచుకుని ఉన్నాయని ఎంత వెతికిన ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నది. ఇక పోలీసుల మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా దామోదర్ గౌడ్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. సింగోటం శ్రీవారి సముద్రం జలాశయంలో దామోదర్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. సాంకేతిక ఆధారాల పరిశీలన తర్వాత నిందితుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఘటన అనంతరం నిందితులు గ్రామం నుంచి పారిపోయి… పెద్ద కొత్తపల్లిలోని బంధువుల ఇంట్లో తల దాచుకున్నారు. ఇక సమాచారం తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.