AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామం.. సందీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు పోలీసుల సిఫార్సు

Hyderabad: మరోవైపు సందీప్‌ రక్త నమూనాలను పరీక్షించగా ప్రాథమిక పరీక్షలో డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే తుది నిర్ధారణ కోసం ఫోరెన్సిక్‌ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతో పాటు ఇతర అంశాలపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి ముందు..

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామం.. సందీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు పోలీసుల సిఫార్సు
Road Accident Case
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 05, 2026 | 12:35 PM

Share

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సైబరాబాద్‌ పోలీసులు కీలక చర్యకు సిద్ధమయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న 23 ఏళ్ల బి. శివ సందీప్‌ సాయి ఆనంద్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులను కోరారు. ఈ మేరకు మాదాపూర్‌ ఏసీపీ శ్రీధర్‌ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. ఆగస్టు 31న తెల్లవారుజామున ఖజాగూడ-నానక్‌రామ్‌గూడ ఓఆర్‌ఆర్‌ రోటరీ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రి సమీపంలో ఉదయం సుమారు 4.30 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్న 31 ఏళ్ల నంద కిషోర్‌ కుమార్‌ రేను ఓ ఇన్నోవా క్రిస్టా ఢీకొట్టింది. బిహార్‌కు చెందిన రే.. రాయదుర్గంలోని షా గౌస్‌ హోటల్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన వాహనాన్ని 21 ఏళ్ల జైద్‌ షా ఖాద్రీ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం తర్వాత ఖాద్రీ వాహనాన్ని ఆపి గాయపడిన రేకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సయ్యద్‌ అమీర్‌ హుస్సేన్‌ కూడా అక్కడికి చేరుకుని సహాయం చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే మరో కారు అక్కడికి వచ్చి వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో నంద కిషోర్‌ కుమార్‌ రే తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. జైద్‌ షా ఖాద్రీకి కుడి కాలుకు ఫ్రాక్చర్‌ కావడంతో పాటు ఇతర గాయాలయ్యాయి. అతడిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సయ్యద్‌ అమీర్‌ హుస్సేన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు ఖజాగూడ-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన రెండో వాహనాన్ని గుర్తించే క్రమంలో దర్యాప్తు ముందుకు సాగింది. చివరకు ఆ వాహనం శివ సందీప్‌ సాయి ఆనంద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆ వాహనం మహీంద్రా ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారుగా పోలీసులు తెలిపారు. సెప్టెంబర్‌ 1న వాహనాన్ని స్వాధీనం చేసుకుని సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేదని కూడా గుర్తించారు. నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో వాహనం గుర్తింపు పోలీసులకు సవాలుగా మారింది. అయితే వాహనం చాసిస్‌, ఇంజిన్‌ నంబర్లతో పాటు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించి దాని వివరాలను నిర్ధారించారు.

మరోవైపు సందీప్‌ రక్త నమూనాలను పరీక్షించగా ప్రాథమిక పరీక్షలో డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే తుది నిర్ధారణ కోసం ఫోరెన్సిక్‌ నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతో పాటు ఇతర అంశాలపైనా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి ముందు, తర్వాత వాహనం కదలికలు, సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్‌ నివేదిక వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us