AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్కైవాక్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు.. ప్రయాణికులకు బెనిఫిట్..

నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో పూర్తిగా మారనున్నాయి. ఈ మేరకు అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక పనుల్లో భాగంగా భారీ స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్‌కు కలుపుతూ ఈ స్కైవాక్ ఉండనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా..

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్కైవాక్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు.. ప్రయాణికులకు బెనిఫిట్..
Sky Walk
Venkatrao Lella
|

Updated on: Mar 06, 2026 | 11:48 AM

Share

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కైవాక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల పాదాచారులు సులువుగా రోడ్డు దాటడంతో పాటు మెట్రో స్టేషన్లకు సులువుగా చేరుకుంటున్నారు. అయితే నగరంలో పలు స్కైవాక్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా సమీపంలోని నాంపల్లి మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా స్కైవాక్ నిర్మించనున్నారు. దీని వల్ల మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ల మధ్య కనెక్టివిటీ మరింత పెరగడంతో పాటు సులువుగా చేరుకోవచ్చు. అలాగే సులభంగా ఇంటర్‌ఛేంజ్ అయ్యేలా స్కైవాక్‌లో ఎస్కలేటర్లు, ట్రావెలేటర్లు అమర్చుతారు. గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర అధికారులతో కలిసి ప్రస్తుతం జరుగుతున్న పనులను కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

మారనున్న నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరిస్తోంది. అందులో భాగంగా నాంపల్లి స్టేషన్‌ను కూడా అభివృద్ది చేస్తున్నారు. 2027 కల్లా పనులు పూర్తి చేసి స్టేషన్లను ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేషన్‌ను ఆధునీకరించనుండగా.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. రోజు నాంపల్లి మీదుగా 60 రైళ్లను నడపడంతో పాటు 28 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో స్టేషన్లలో 16 లిప్టులు, ఎనిమిది ఎస్కలేటర్లు అమర్చనున్నారు. స్టేషన్‌కు వచ్చే, ఇక్కడినుంచే బయల్దేరే ప్రయాణికులకు వేర్వేరుగా ఇవి ఉండనున్నాయి. ఇక బేస్ మెంట్ పార్కింగ్‌తో పాటు వాష్ రూమ్స్, కియోస్క్‌లు, ఫుడ్ స్టాల్స్ ఉండనున్నాయి. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం 6,500 చదరపు అడుగుల స్థలం కేటాయించనున్నారు.

కవచ్ వ్యవస్థ ఏర్పాటు

ఇక నాంపల్లితో పాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో కూడా ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇక చర్లపల్లి వద్ద ఇప్పటికే సరికొత్త టెర్మినల్ నిర్మించారు. ఈ ఏడాది తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో రూ.5,454 కోట్ల కేటాయింపులు వచ్చాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలోని 40కిపైగా స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ఇక కాజీపేట రైల్వే తయారీ యూనిట్ మూడు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ కవచ్ 3.2 63 స్టేషన్లను కలుపుతూ 639 కిలోమీటర్లలో అమలు చేస్తున్నారు. ఇక కవచ్ 4.0 అప్‌గ్రేడ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇక అదనంగా 384 కిలోమీటర్ల రూట్లలో ఇన్‌స్టాలేషన్ జరుగుతోంది. తెలంగాణలో ప్రస్తుతం రూ.47,984 కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Follow Us