రిటైర్మెంట్ వయసును పెంచుతాం: సీఎం కేసీఆర్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60కు లేదా 61కు పెంచుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యసేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా ప్రజాసేవకులం అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంతో దూషించడాన్ని […]
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60కు లేదా 61కు పెంచుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యసేవకుడు అనే భావనతోనే తానుంటానని, అధికారులు కూడా ప్రజాసేవకులం అనుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంతో దూషించడాన్ని సహించమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని కేసీఆర్ తెలిపారు. అన్ని శాఖల్లో పదోన్నతులకు జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు. అలాగే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ తీసుకున్న నిర్ణయంపై ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేసీఆర్ ఆదేశించారు.
ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చిందని.. దీని ద్వారా కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు ఏర్పాటు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. తండాలు, గూడాలు, శివారు పల్లెలకు ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటయ్యాయని.. గ్రామ పంచాయతీల సంఖ్య 8,690 నుంచి 12,751కు పెరిగిందని తెలిపారు. 3,146 మంది ఎస్టీలు సర్పంచ్లు అయ్యే అవకాశం కలిగిందని అన్నారు. ‘‘గ్రామ పంచాయతీలు నేలవిడిచి సాము చేయవద్దు. గ్రామ పంచాయతీలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల రూపులేఖలు మార్చాలి. గ్రామ స్థాయిలో ప్రభుత్వమే చాలా పనులు నిర్వహిస్తుంది’’ అని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్కాకతీయ ద్వారా మంచి చెరువులను పునరుద్ధరించి.. వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు తాగు నీరును అందిస్తున్నామని చెప్పారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. రేషన్షాపుల ద్వారానే బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నామని.. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జరుగుతున్నాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలు గ్రామ పంచాయతీలపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు. అయితే వార్షిక పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం క్రమం తప్పకుండా పన్నులు వసూలు చేయడం, విద్యుత్ బిల్లులు వసూలు చేయడం, వీధిలైట్ల పనితీరు బాధ్యత కూడా గ్రామ పంచాయతీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.