AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం.. ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!

ఆధునిక సమాజంలో వివాహం అంటే అతిపెద్ద వేడుక. అలాంటి వేడుకను రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వెడ్డింగ్ టూరిజాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఆడంబరాలకు పోయి భారీ సెట్టింగులు, ఫాస్ట్ ఫుడ్, విదేశీ ఆహారంతో రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కొంతమంది వినూత్నంగా ఆలోచనలు చేసి పది మందికి ఆదర్శంగా నిలుస్తారు.

పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం..  ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!
Pollution Free, Organic Marriage
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 9:05 PM

Share

ఆధునిక సమాజంలో వివాహం అంటే అతిపెద్ద వేడుక. అలాంటి వేడుకను రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వెడ్డింగ్ టూరిజాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి పేరుతో ఆడంబరాలకు పోయి భారీ సెట్టింగులు, ఫాస్ట్ ఫుడ్, విదేశీ ఆహారంతో రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నారు. కొంతమంది వినూత్నంగా ఆలోచనలు చేసి పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. పర్యావరణ కాలుష్యం లేని సేంద్రియ (ఆర్గానిక్) పెళ్లికి మొగ్గు చూపింది ఓ యువతి. ఆర్గానిక్ పెళ్లి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ కు చెందిన మేఘనా రెడ్డి.. బీటెక్ పూర్తి చేసింది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు కౌటిల్య రెడ్డితో పెళ్లి నిశ్చయించారు. ఎప్పుడు నిరాడంబరంగా ఉండే మేఘనా.. పెళ్లి విషయంలో కూడా అదే ఆలోచనతో ఉంది. ఎలాంటి కాలుష్యం లేకుండా మామిడి తోరణాలు.. తాటాకు, కొబ్బరి మట్టలతో పందిళ్లు… అరిటాకు భోజనాలు.. ఒకప్పటిలా పెళ్లి చేసుకోవాలని భావించింది. తన పెళ్లికి ఫాస్ట్ ఫుడ్, విదేశీ ఆహారం వంటివి కాకుండా సహజసిద్ధమైన వాటితో, ఆరోగ్యాన్ని పంచేలా ఉండాలనుకున్నారు.

సేంద్రియ (ఆర్గానిక్) పెళ్లి విషయాన్ని తనకు కాబోయే భర్త కౌటిల్య రెడ్డి, తల్లిదండ్రులు నాగెండ్ల జయమ్మ, సీతారాంరెడ్డిలకు తెలియజేసింది. మేఘనా రెడ్డి ఆలోచనకు వారు ఓకే చెప్పారు. దీంతో నల్లగొండలో జరిగిన వివాహ వేడుకలో వధూవరులతోపాటు కుటుంబ సభ్యులంతా పెళ్లిలో చేనేత వస్త్రాలనే ధరించారు. మామిడి ఆకుల తోరణాలు, తాటాకు, కొబ్బరి మట్టలతో పెళ్లి పందిరిని తీర్చిదిద్దారు. భోజనాలకు ప్రకృతి, గో ఆధారిత పంట ఉత్పత్తులనే ఎంచుకున్నారు. బాస్మతి, మైసూరు మల్లిక, రాణి ఆకాండ, కులకర్, నవారా ఇలా భిన్న వరిరకాలతో పులిహోర, పనస బిర్యానీ, కరివేపాక అన్నం, సాంబార్ అన్నం, పెరుగు అన్నం వంటివి సిద్ధం చేయించారు. సంప్రదాయ రుచులను మర్చిపోవద్దనే ఉద్దేశంతో జొన్నరొట్టె, పచ్చి పులుసు, భక్ష్యాలు, జొన్న గటక, సకినాలు వంటి తెలంగాణ వంటకాలు చేశారు.

ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేసే రసాయన రహితంగా పండించిన కూరగాయలు, తృణధాన్యాలు, దేశీ ఆవు నెయ్యి, బెల్లం ఉపయోగించి రుచికరమైన సాంప్రదాయ వంటకాలు సిరిధాన్యాల బిర్యానీ, రాగి సంకటి, ప్రకృతి సిద్ధమైన స్వీట్లు వడ్డించడం ద్వారా అతిథులకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డించారు. పెళ్లిలో మొత్తం ఆర్గానిక్ వంటలు వడ్డించి పెళ్లివారిని ఆశ్చర్యపరిచారు.

పర్యావరణవేత్త సురేశ్ గుప్తా స్ఫూర్తితో సేంద్రియ వివాహాన్ని చేసుకోవాలని భావించానని పెళ్లి కూతురు మేఘనా రెడ్డి తెలిపారు. తన ఆలోచన విని మొదట్లో అందరూ వింతగా చూశారు. పెళ్లి ఏర్పాట్లు చూశాక అందరూ మెచ్చుకున్నారు. పర్యావరణహిత పెళ్లిళ్లను చేసుకోమని, స్థానిక రైతులకు, సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యమివ్వమని కొత్త జంట పిలుపు ఇస్తున్నారు. ఈ పెళ్లిలోని వంటకాలు ఆరగించిన బంధువులంతా విందు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us