AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే?

IRCTC Sapta Jyotirlinga Mahayatra: దేశంలోని 7 ప్రముఖ జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయాన్ని దర్శించేలా IRCTC 'సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర'ను ప్రకటించింది. సెప్టెంబర్ 25 నుంచి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో 11 రోజుల ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం కానుంది. ప్యాకేజీ ధరలు, సందర్శించే క్షేత్రాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే?
Irctc Sapta Jyotirlinga Mahayatra
Rajashekher G
|

Updated on: Aug 06, 2026 | 8:03 PM

Share

IRCTC Sapta Jyotirlinga Mahayatra Telugu: దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’ పేరుతో ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్‌ను ప్రకటించింది. ఈ 11 రోజుల యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 7 జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రత్యేక రైలు 2026 సెప్టెంబర్ 25న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనుంది.

11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం

ఈ యాత్రలో భక్తులు కింది పవిత్ర క్షేత్రాలను సందర్శించనున్నారు.

  1. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం
  2. నర్మదా నదీ తీరంలోని ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం
  3. ద్వారక సమీపంలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం
  4. సోమనాథ్‌లోని సోమనాథ్ జ్యోతిర్లింగం
  5. పుణే సమీపంలోని భీమశంకర్ జ్యోతిర్లింగం
  6. ఛత్రపతి సంభాజీనగర్ సమీపంలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం
  7. నాసిక్‌లోని త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగం

ద్వారకాధీశ్ ఆలయం కూడా యాత్రలో భాగం

ఈ ప్యాకేజీలో హిందువుల నాలుగు ప్రధాన ధామ్‌లలో ఒకటైన ద్వారకాధీశ్ ఆలయం సందర్శన కూడా ఉంది. అలాగే రుక్మిణీ దేవి ఆలయం, బేట్ ద్వారక, సోమనాథ్ బీచ్, భాల్కా తీర్థం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా భక్తులు దర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఎల్లోరా కైలాసనాథ ఆలయం, పంచవటి సందర్శన

మహారాష్ట్రలోని యాత్రలో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎల్లోరా గుహల్లోని కైలాసనాథ ఆలయంను సందర్శించే అవకాశం ఉంటుంది. అనంతరం నాసిక్‌లోని పంచవటి ప్రాంతాన్ని కూడా టూర్‌లో చేర్చారు. రామాయణం ప్రకారం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశంగా పంచవటి ప్రసిద్ధి చెందింది.

ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు

భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైల్లో ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో:

  • AC-I, AC-II, AC-III తరగతి కోచ్‌లు
  • పరిశుభ్రమైన శాకాహార భోజనం
  • 3 స్టార్ హోటళ్లలో వసతి
  • ఏసీ వాహనాల్లో స్థానిక దర్శనాలు
  • ప్రయాణ బీమా
  • ప్రత్యేక IRCTC టూర్ మేనేజర్ల సేవలు
  • భద్రతా ఏర్పాట్లు

అలాగే నిరంతరం రైలులోనే ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, ముఖ్యమైన ప్రదేశాల్లో హోటల్‌లో రాత్రి బస ఏర్పాటు చేశారు.

ప్యాకేజీ ధరలు

ఈ టూర్‌కు ఒక్కో వ్యక్తికి డబుల్ ఆక్యుపెన్సీ ఆధారంగా ధరలు ఇలా ఉన్నాయి.

  • AC-III: రూ.90,930 నుంచి
  • AC-II: రూ.1,09,925 నుంచి
  • AC-I: రూ.1,19,425 నుంచి

ఈ ధరల్లో రైలు ప్రయాణం, హోటల్ వసతి, శాకాహార భోజనం, స్థానిక రవాణా, దర్శనాలు, ప్రమాద బీమా, IRCTC టూర్ మేనేజర్ల సేవలు అన్నీ కలిపి ఉంటాయి. రైల్వే టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేలు అందిస్తున్న సుమారు 33 శాతం రాయితీ కూడా ఈ ప్యాకేజీ ధరల్లోనే పొందుపరిచారు.

బుకింగ్ ఎలా చేయాలి?

ఈ ప్రత్యేక ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న ప్రయాణికులు IRCTC టూరిజం పోర్టల్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక IRCTC టూరిజం కార్యాలయాల ద్వారా తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు. దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తులకు ఈ IRCTC టూర్ ఒక అరుదైన అవకాశంగా నిలుస్తోంది.

‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’ ప్యాకేజీ, బుకింగ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us