Hyderabad: ఖైదీకి విపరీతమైన కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
ఖైదీకి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో జైల్లో ప్రాథమిక చికిత్స అందించారు డాక్టర్లు. అయినా ఫలితం లేదు. దీంతో జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. స్కానింగ్ తీశారు వైద్యులు. స్కానింగ్ రిపోర్టులు చూసి వైద్యులు, జైలు అధికారులు షాక్కు గురయ్యారు.

చంచల్గూడ జైలు.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉంటుంది. అందులో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్నవారు ఉన్నారు. అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నానంటూ కేకలు వేశాడు. జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో.. ఎస్కార్టు పోలీసులు ఈ నెల 8న ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. ఎక్స్ రే పరిశీలించగా.. కడుపులో షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు.. ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్కు పంపించారు.
గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్కుమార్ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచారించి.. అతనికి మానిసికపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే.. ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.