SCR: రైల్వే భద్రతా విషయంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. హైదరాబాద్లో తొలిసారి..
South Central Railway: రైల్వే భద్రతా విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో కీలక అడుగు వేసింది. రైలు ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన రైలు ప్రయాణానికి వీలుగా రైళ్ల ద్వారా..
South Central Railway: రైల్వే భద్రతా విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో కీలక అడుగు వేసింది. రైలు ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన రైలు ప్రయాణానికి వీలుగా రైళ్ల ద్వారా రవాణా చేసే పార్సిల్ సరుకులను స్కానింగ్ చేసే ప్రక్రియను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ స్టేషన్ పార్సిల్ కార్యాలయంలో మొదటి పార్సిల్ స్కానర్ను ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ వినూత్న వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్ డివిజన్లో ప్రారంభించారు.
పార్సిల్ సరుకులను సాధారణంగా పార్సిల్ వ్యాన్లలో లేదా ప్రయాణికుల రైళ్లలోని గార్డ్స్ బ్రేక్ వ్యాన్ ప్రక్కన ఉండే లగేజ్ రూమ్లో రవాణా చేస్తారు. రైళ్లలో పార్సిల్ రవాణా చేసేందుకు ఇటీవల రైల్వే అనేక ఆకర్షణీయమైన విధానాలను చేపట్టడంతో ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పార్సిల్ రవాణా భారీగా అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా ప్రయాణికుల రక్షణం కోసం రైల్వే పార్సిల్ రవాణాలో అనేక భద్రతా చర్యలు చేపడుతున్న సికింద్రాబాద్ డివిజన్ హైదరాబాద్ స్టేషన్లోని పార్సిల్ కార్యాలయంలో పార్సిల్ స్కానర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
భారతీయ రైల్వే న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (ఎన్ఐఎన్ఎఫ్ఆర్ఐఎస్)లో భాగంగా ఈ స్కానర్ను ఏర్పాటు చేశారు. స్కానింగ్ పూర్తయిన తర్వాత లగేజ్పై స్టిక్కర్లు/స్టాంపులు అతికిస్తారు. స్కాన్ చేసిన ప్యాకేజీలు మాత్రమే బుకింగ్, లోడిరగ్కు అనుమతిస్తారు. వీటికి నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు. నాన్ లీజ్డ్ పార్సిల్ వ్యాన్లలో పార్సిల్ బుకింగ్ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.10, లీజ్డ్ వ్యాన్లలో పార్సిల్స్ కోసం ప్రతి ప్యాకేజీపై రూ.5 వసూలు చేస్తారు. ఈ ఏర్పాట్లకు కృషి చేసిన సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శ్రీ అభయ్ కుమార్ గుప్తా, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) శ్రీ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతా విషయంలో దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడూ ముందుంటుందని, ప్రస్తుత సమయంలో ఇలాంటి వ్యవస్థల అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి భద్రతా చర్యలను రానున్న రోజుల్లో ఇతర పార్సిల్ కార్యాలయాల్లో కూడా అమలు చేయడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామి అరున్ కుమార్ పేర్కొన్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..