Hyderabad: భాగ్యనగరంలో లా అండ్ ఆర్డర్‌పై ఫోకస్.. పాత నేరస్థులు, రౌడీ షీటర్లకు సైబరాబాద్ సీపీ వార్నింగ్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులు, హత్యలు తదితర కేసులలో సంబంధం ఉన్నవారు సత్ప్రవర్తనతో మెలగాలంటూ.. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.

Hyderabad: భాగ్యనగరంలో లా అండ్ ఆర్డర్‌పై ఫోకస్.. పాత నేరస్థులు, రౌడీ షీటర్లకు సైబరాబాద్ సీపీ వార్నింగ్
Stephen Raveendra
Follow us

|

Updated on: Jun 07, 2022 | 6:26 PM

Stephen Raveendra: హైదరాబాద్‌లో నగరంలో నేరాలు, అత్యాచార ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లా అండ్ ఆర్డర్‌పై ఫోకస్ పెట్టారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు కీలక ఆదేశాలిచ్చారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ (Cyberabad Police) స్టీఫెన్ రవీంద్ర పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం సైబరాబాద్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో నేరాలకు పాల్పడిన వారితో సమావేశం ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులు, హత్యలు తదితర కేసులలో సంబంధం ఉన్నవారు సత్ప్రవర్తనతో మెలగాలంటూ హెచ్చరించారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర స్పష్టంచేశారు. మెజిస్ట్రేట్ అధికారాలను వినియోగించి ఈ కింది నేరస్థులపై విచారణ జరిపి ఆ వ్యక్తులు సత్ప్రవర్తనతో మెలుగుట కోసం హామీ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇద్దరు జమీనుదారులతో 50 వేల రూపాయల హామీ బాండ్ ఇచ్చేలా సూచించామన్నారు. సెక్షన్ 107/122 CrPC ప్రకారం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైతే ఒక సంవత్సర కాలం జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు పలు వివరాలను వెల్లడించారు.

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ ఇమ్రాన్, సయ్యద్ రషీద్, మహమ్మద్ గతంలో ఒక హత్యకేసులో రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో ప్రజలకు శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లు తెలిపారు. అదే పోలీస్ స్టేషన్ పరిధిలో రాంలాల్ శంకర్ లాల్ పరదేశి, మొహమ్మద్ షాబాజ్ ఖాన్లు కుల్సుంపుర, పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో ఉండి ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. అలాగే సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ గౌస్, జగద్గిరిగుట్ట స్టేషన్ పరిధిలో అలిగా నరేష్, శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నక్క నరేష్ మొదలగు వీరందరిపై శాంతి, సత్ప్రవర్తనతో ఒక సంవత్సర కాలం నిలుపుట కోసం ప్రతి వ్యక్తికి 50 వేల రూపాయల హామీ బాండ్ తీసుకోవడం జరిగినట్లు తెలిపారు.

ఈ సంవత్సర కాలం పాటు ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసినట్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఏ‌సీపీ రవిచంద్ర, ఇన్ స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..