BJP Vijaya Sankalpa Sabha: ముగిసిన బీజేపీ విజయ సంకల్ప సభ.. అభివృద్ధే ప్రధాన అంశంగా సాగిన మోదీ ప్రసంగం..

|

Updated on: Jul 03, 2022 | 8:09 PM

PM Modi Speech in Hyderabad: హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ..

BJP Vijaya Sankalpa Sabha: ముగిసిన బీజేపీ విజయ సంకల్ప సభ.. అభివృద్ధే ప్రధాన అంశంగా సాగిన మోదీ ప్రసంగం..

PM Modi Speech in Hyderabad: హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధినే ప్రధాన అంశంగా ప్రసంగించారు. తెలంగాణకు కేంద్రం నుంచి అందుతోన్న నిధులు, చేస్తోన్న అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను మోదీ ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శల జోలికి వెళ్లలేదు. తెలంగాణలో డబులు ఇంజన్‌ ప్రభుత్వం వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

సభలో మోదీ మాట్లాడుతూ.. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నారు. 8 ఏళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్న మోదీ.. దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను భాజపా నెరవేర్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచామని తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా ఉన్నామని గుర్తు చేశారు. ఇక విజయ సంకల్ప సభ ముగిసిన వెంటనే నరేంద్ర మోదీ నేరుగా రాజ్‌ భవన్‌ చేరుకున్నారు. ఈ రోజు రాత్రి రాజ్‌ భవన్‌లోనే బస చేయనున్న మోదీ, సోమవారం ఉదయం భీమవరం వెళ్లనున్నారు. అక్కడ అల్లూరి సీతరామరాజు విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న తర్వాత, బహిరంగ సభలో ప్రసగించనున్నారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jul 2022 07:49 PM (IST)

    రాజ్‌ భవన్‌ చేరుకున్న మోదీ..

    విజయ సంకల్ప సభ ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ నేరుగా రాజ్‌ భవన్‌కు చేరకున్నారు. రాత్రికి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న మోదీ. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో భీమవరం వెళ్లనున్నారు. అక్కడ అల్లూరి సీతరామారాజు విగ్రహం ఆవిష్కరణ అనంతరం తిరిగి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.

  • 03 Jul 2022 07:07 PM (IST)

    నరేంద్రమోదీ ప్రసంగం..

    విజయ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మీ ప్రేమ, ఆశీర్వాదానికి నమస్కారం. తెలంగాణ స్నేమంతా ఇక్కడ కనిపిస్తోంది. గత రెండు రోజులుగా బీజేపీ ప్రతినిధులు, నాయకులు మీ ప్రేమను పొందారు. మీరంత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నేలకు, స్ఫూర్తికి వందనం. తెలంగాణ పరాక్రమానికి నిదర్శనం. ఇక్కడి శిల్పసంపద మనందరికీ గర్వకారణం. తెలంగాణ ఓ పుణ్యస్థలం. తెలంగాణ అభివృద్దే మా ప్రధమ లక్ష్యం. హైదరాబాద్‌ అన్నింటికి కొత్త శక్తినిస్తుంది. 8 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం.

    కరోనా సమయంలో తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి అండగా ఉన్నాం. తెలంగాణలోని పేదలకు ఉచితంగా రేషన్‌ అందించాం. తెలంగాణలో బీజేపీపై విశ్వాసం పెరుగుతోంది. మా అభివృద్ది ఫలాలు ప్రతీ ఒక్కరికి అందుతున్నాయి. 2019 నుంచి మాకు అంతకంతకు మద్ధతు పెరుగుతోంది. తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇంజన్‌ సర్కారును కోరుకుంటున్నారు. మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశాం. వారికి సులభంగా రుణాలు ఇస్తున్నాం. హైదరాబాద్‌లో జరిగిన టీకా పరిశోధన ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కాపాడింది. తెలుగులో మెడికల్‌, ఇంజనీరింగ్ విద్యను తీసుకురాబోతున్నాం.

    తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాము. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించేందుకు 2015 నుంచి కృషి చేస్తున్నాం. తెలంగాణ రైతుల జీవితాలను మార్చాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో రీజినల్‌ రింగ్‌ రోడ్‌ను కేంద్రం నిర్మిస్తోంది.తెలంగాణలో 5 వేల కిలోమీటర్ల నేషనల్‌ హైవే నెట్‌వర్క్‌ ఉంది. తెలంగాణ అంతటా కనెక్టివిటీ పెంచాలని చూస్తున్నాం. పట్టణాలనే కాదు, గ్రామాలను కూడా కనెక్ట్‌ చేస్తాం. మెగాటెక్ట్స్‌టైల్‌ పార్క్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తాము’ అని చెప్పుకొచ్చారు మోదీ.

  • 03 Jul 2022 06:59 PM (IST)

    తెలంగాణ నుంచి కేసీఆర్‌ సర్కార్‌ పోవడం ఖాయం - నడ్డా

    విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. 'ప్రజలు కేసీఆర్‌ పాలన, అవినీతితో విసిగిపోయారు. తెలంగాణ నుంచి కేసీఆర్‌ సర్కార్‌ పోవడం ఖాయం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. విపక్షాలను పడగొట్టాలని కేసీఆర్‌ చూస్తున్నారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఆదరించారు. హుజూరాబాద్‌లో రాజేందర్‌ను గెలిపించి హుజూర్‌ను పడగొట్టారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోంది' అంటూ నడ్డా విరుచుకుపడ్డారు.

  • 03 Jul 2022 06:50 PM (IST)

    పేదలను ఆదుకున్న దేవుడు మోదీ: బండి సంజయ్‌

    బీజేపీ విజయ సంకల్ప సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ..'కేసీఆర్‌ నరేంద్ర మోదీని ఎందుకు తిడుతున్నారు. పేద ప్రజలు ఆకలితో ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా నరేంద్ర మోదీని తిడుతుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుకున్న తెలుగు వారిని యుద్ధం ఆపి కాపాడినందుకా తిట్టేది. కేసీఆర్‌లాంటి మూర్ఖులకు మోదీ గారి గొప్పతనం తెలియదు. మోదీ పేదలను ఆదుకున్న దేవుడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోదీ రూ. వేల కోట్ల నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌ కు ధ్యాసలేదు. బీజేపీ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారని అంటున్నారు. కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే ఇక్కడ నిర్వహించాము. తెలంగాణ సమాజంలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే సమావేశాలను ఇక్కడ ఏర్పాటు చేశాము. డబుల్‌ ఇంజన్‌ పాలనను తెలంగాణలో ఇవ్వండి. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారి నిజాయతీ పాలన రావాలి. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ ధన్యవాదాలు' అంటూ బండి సంజయ్ ప్రసంగాన్ని ముగించారు.

  • 03 Jul 2022 06:29 PM (IST)

    సభా స్థలికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

    హెలికాప్టర్‌లో బేగం పేట్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పరేడ్‌ గ్రౌండ్స్‌ చేరుకున్నారు. మరికాసేపట్లో మోదీ ప్రంసగం ప్రారంభం కానుంది. మోదీ ఏం మాట్లాడనున్నారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

  • 03 Jul 2022 06:09 PM (IST)

    బీజేపీకి తెలంగాణలో మద్ధతు పెరుగుతోంది: మోదీ ట్వీట్‌

    పరేడ్‌ గ్రౌండ్‌కు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రసగించనున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణలో బీజేపీకి మద్ధతు పెరుగుతోందని, తాము చేసిన అభివృద్ది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయని పేర్కొన్నారు.

  • 03 Jul 2022 06:06 PM (IST)

    కొడుకును సీఎం చేయడమే కేసీఆర్‌ లక్ష్యం: అమిత్‌ షా

    బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. 'టీఆర్‌ఎస్‌ చెప్పినట్లు నీళ్లు వచ్చాయా, నిధులు వచ్చాయా, నియామకాలు వచ్చాయా. కేసీఆర్‌కు తన కొడుకును ముఖ్యమంత్రి ఎలా చేయాలనే ఉంది. యువత ఉద్యోగాల కంటే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనే ఆశతో ఉన్నారు. కేసీఆర్‌.. నా మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకో. నీది కాదు.. నీ కొడుకుది కాదు వచ్చేది బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్‌ ప్రభుత్వ స్టీరింగ్‌ ఒవైసీ చేతుల్లో ఉంది. అలాంటి వారు ప్రజల బాగోగులు చూస్తారా' అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.

  • 03 Jul 2022 05:56 PM (IST)

    సభలో ప్రసంగిస్తున్న నాయకులు..

  • 03 Jul 2022 05:48 PM (IST)

    మీ నుంచి ఏం చూసి నేర్చుకోవాలి కేసీఆర్‌: కిషన్‌ రెడ్డి ఫైర్‌

    బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..'కల్వకుంట్ల కుటుంబం మమ్మల్ని చూసి నేర్చుకోండని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మీ అవనీతి చూసి నేర్చుకోవాలా.? 8 ఏళ్లుగా సచివాలయానికి రాని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా.? నెలకు 20 రోజులు ఫామ్‌ హౌజ్‌లో ఉండి పాలన చేసే ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలా.? బీజేపీ తెలంగాణలో మీకంటే మంచి పాలన ఇస్తుంది. మేము నిజమైన ప్రజాస్వామ్య పాలన ఇస్తాము. మీలాగా ఫామ్‌ హౌజ్‌లో ఉండే పరిపాలన ఇవ్వము. తెలంగాణ ప్రజలారా బీజేపీని ఆశీర్వదించండి. తెలంగాణ ద్రోహులను వెంట పెట్టుకొని పాలన చేస్తున్న మిమ్మల్ని చూసి మేము నేర్చుకునేది ఏమీ లేదు' అంటూ కిషన్‌ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు.

  • 03 Jul 2022 05:35 PM (IST)

    మొదలైన విజయ సంకల్ప సభ..

    పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ మొదలైంది. హెచ్‌ఐసీసీ నుంచి అగ్ర నాయకులంతా సభా స్థలికి చేరుకుంటున్నారు. అమిత్‌ షా, నితిన్‌ గడ్కారీ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. యూపీ సీం యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేక సెక్యూరిటీతో పరేడ్‌ గ్రౌండ్‌ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో హెలికాప్టర్‌ ద్వారా బేగంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకొని, అక్కడి నుంచి సభా స్థలికి వెళ్లనున్నారు.

  • 03 Jul 2022 04:56 PM (IST)

    ముగిసిన కార్యవర్గ సమావేశాలు..

    హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు సాగిన బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. మోదీ ప్రసంగంతో ఈ సమావేశాలు పూర్తయ్యాయి. మరికాసేపట్లో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప సభకు నేతలు తరలి వెళుతున్నారు.  ఈ సందర్భంగా కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున సభకు హాజరవుతున్నారు. తలాపాగ చుట్టుకొని సభకు వెళ్లిన మహిళలు అందరి దృష్టిని ఆకర్షించారు.

  • 03 Jul 2022 04:32 PM (IST)

    ముగింపు దశకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం..

    హైదరాబాద్‌లో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు దశకు చేరుకుంది. చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. తెలంగాణ అంశంతో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సర్దార్‌ పటేల్‌ వల్లే ఈరోజు తెలంగాణ భారత దేశంలో ఉందని మోదీ తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు వెళ్లిన జాతీయ ప్రతినిధులను మోదీ అభినందించారు.

  • 03 Jul 2022 04:09 PM (IST)

    పరేడ్‌ గ్రౌండ్స్‌కు క్యూ కడుతోన్న కార్యకర్తలు..

    బీజేపీ విజయ సంకల్ప సభకు కార్యకర్తలు క్యూ కడుతున్నారు. పరేడ్ గ్రౌండ్ లోకి వచ్చే వారు కండువా, టోపి పెట్టుకోవాలని నిర్వాహకులు సూచించారు. గ్రౌండ్ లోకి వచ్చే వారందరి బీజేపీ కండువా, బీజేపీ క్యాప్ పంపిణీ చేస్తున్నారు. '2024 మోదీ వన్స్ మోర్' నినాదాలతో గ్రౌండ్స్‌లోకి కార్యకర్తలు వస్తున్నారు. రామలక్ష్మణులతో ఉన్న హనుమంతుని ఫోటోతోపాటు, మోదీ ఫోటో ప్రదర్శనతో సభలోకి కార్యకర్తలు వస్తున్నారు.

  • 03 Jul 2022 04:01 PM (IST)

    హైటెక్స్‌ కమాన్‌ వద్ద ఎమ్‌ఆర్‌పీఎస్‌ కార్యకర్తల హంగామా..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతోన్న నోవాటెల్‌ వైపు వెళ్లేందుకు ఎమ్‌ఆర్‌పీఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. హైటెక్స్‌ కమాన్‌ వద్ద గుంపుగా వెళ్లడానికి ప్రయత్నించగా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి పంపించేశారు. బీజేపీ సభను అడ్డుకుంటామని ఎమ్‌ఆర్‌పీఎస్‌ పిలుపునిచ్చారు.

    Hitex

  • 03 Jul 2022 03:45 PM (IST)

    విజయ సంకల్ప సభ వద్ద గద్దర్ సందడి..

  • 03 Jul 2022 03:33 PM (IST)

    కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్‌ఎస్‌ దుర్వినియోగం చేస్తోంది: పీయూష్ గోయల్

    కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించిన ఆయన, నీళ్లు, నిధులు, నియామాకాలు పేరిట అధికారంలోకి వచ్చిన తెరాస పట్ల తెలంగాణ ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను చరమ గీతం పాడి.. ఇక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఏర్పాటు చేస్తామని గోయల్ ధీమా వ్యక్తం చేశారు.

  • 03 Jul 2022 03:21 PM (IST)

    విజయ సంకల్ప సభలో ప్రత్యక్షమైన గద్దర్‌..

    బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రజా గాయకుడు గద్దర్‌ ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీ నాయకుడు. ఆయన స్పీచ్‌ వినేందుకునే సభకు వచ్చాను. మోదీ ఆలోచన విధానం ఏంటో తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. తెలంగాణ పై స్టేట్‌మెంట్‌ అంటున్నారు. అదేంటో వింటాను' అంటూ చెప్పుకొచ్చారు.

  • 03 Jul 2022 03:08 PM (IST)

    పరేడ్‌ గ్రౌండ్‌కి మోదీ ఎలా చేరుకుంటారంటే..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో 4.30 గంటలకు పాల్గొననున్న మోదీ అనంతరం సాయంత్రం 5.55 గంటలకు హెచ్‌ఐసీసీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బేగంపేపట ఎయిర్‌పోర్ట్‌కు హెలికాప్టర్‌లో చేరుకొని, 6.30 కల్లా పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు మోదీ సభలో ఉంటారు. ఈ రోజు రాత్రి మోదీ రాజ్‌ భవన్‌లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు బేగం పేట ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు.

  • 03 Jul 2022 02:57 PM (IST)

    జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటలకు ప్రత్యేక అవకాశం..

    హైదరాబాద్‌లో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈటల ప్రత్యేకంగా ప్రసగించారు. సమావేశాన్ని ఉద్దేశించి 15 నిమిషాలు ప్రసగించారు. ఇదిలా ఉంటే అంతకు ముందు ఈటెలను పిలిపించుకొని అమిత్ షా, నడ్డా ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కేసీఆర్ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిపై ఈటల తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీగా బీజేపీని ప్రజలు నమ్ముతున్నారన్న ఈటల, ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీనీ ఆదరిస్తారని వివరించారు. ఈటల ప్రసంగాన్ని మోదీతో పాటు నడ్డా అభినందించారు.

  • 03 Jul 2022 02:49 PM (IST)

    హైదరాబాద్‌కు స్పెషల్‌ ఫ్లైట్స్‌ తాకిడి.. రెండు రోజుల్లో ఏకంగా 10

    బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశంతో బేగంపేట్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్స్ తాకిడి పెరిగింది. రెండు రోజుల్లో 10 స్పెషల్ ఫ్లైట్స్‌లో పలువురు ప్రముఖులు సమావేశాలకు చేరుకున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పెషల్ ఫ్లైట్‌లో బేగంపేట్ ఎయిర్‌ పోర్ట్‌ చేరుకున్నారు. స్పెషల్‌ ఫ్లైట్స్‌లో హైదరాబాద్‌ చేరుకున్న ప్రముఖులు వీరే.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, అస్సాం సీఎం హిమాంత బిశ్వాస్, త్రిపుర సీఎం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా. వీరితో పాటు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా సైతం ప్రత్యే విమానంలోనే హైదారాబాద్‌ వచ్చారు.

  • 03 Jul 2022 02:42 PM (IST)

    వంటకాలను దగ్గరుండి పరిశీలించిన ప్రధాని..

    హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులకు రకరకాల వంటకాలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సంప్రదాయాలు ఉట్టి పడేలా వంటలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వంటకాలను పరిశీలించారు.

    Modi

    Modi 1

  • 03 Jul 2022 01:53 PM (IST)

    తెలంగాణ, ప.బెంగాల్‌లో అధికారంలోకి వస్తాం.. బీజేపీ ధీమా

    దేశ దక్షిణాదిపై బీజేపీ తప్పక పట్టు సాధిస్తుందని అసోం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సమావేశ వివరాలను మీడియాకు వెళ్లడించిన ఆయన.. సౌత్‌లో బీజేపీ పవర్‌ను త్వరలోనే మీరు చూస్తారని అన్నారు. తెలంగాణ‌లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సమావేశాల్లో హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారంటూ ఆయన వెల్లడించారు. సమావేశంలో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించినట్లు హేమంత్ బిశ్వాస్ శర్మ వెల్లడించారు.

  • 03 Jul 2022 01:49 PM (IST)

    ప్రత్యేక బస్సుల్లో పరేడ్ గ్రౌండ్స్‌కి బీజేపీ నేతలు..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు HICC నుంచి బస్సుల్లో పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లనున్నారు.  ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మినహా 340 మంది బీజేపీ నేతలు ప్రత్యేక బస్సుల్లో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ప్రత్యేక బస్సుల్లోనే పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 03 Jul 2022 01:47 PM (IST)

    బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మార్పులు

    సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో మెయిన్ రోడ్లపై ట్రాఫిక్‌ని పోలీసులు డైవర్ట్ చేస్తున్నారు. పంజాగుట్ట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ మళ్లించి నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వైపు పంపుతున్నారు. మోడీ సభ సందర్భంగా ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు అలర్ట్ తో ప్రజలు ఎక్కువవ రోడ్లపైకి రాలేదు. దీంతో ప్రధాన రోడ్లు రద్దీ తక్కువగా కనిపిస్తోంది.

  • 03 Jul 2022 01:46 PM (IST)

    సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం..

    గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని హోంత్రి అమిత్ షా పేర్కొన్నారని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని సుప్రీం కోర్టు ప్రకటించిందని, రాజకీయంగా ప్రేరేపించినట్లు కోర్టు పేర్కొందని అసోం సీఎం గుర్తుచేశారు.

  • 03 Jul 2022 01:43 PM (IST)

    ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం ఆమోదం.. అసోం సీఎం హిమంత బిస్వా శర్మ

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదటి రోజున తాము ఆర్థిక తీర్మానంపై చర్చించామని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. 2వ రోజు (ఆదివారం) రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిందని తెలిపారు. హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని.. దానికి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ మీడియాకు తెలిపారు.

  • 03 Jul 2022 01:39 PM (IST)

    ఇంటెలిజెన్స్ వ్యవహారంపై ఆరా..

    ఇంటలిజెన్స్ సీఐ వ్యవహారంపై పోలీస్ శాఖ ఆరా తీసింది. కేటాయించిన ప్రదేశంలో కాకుండా లోపలకి వెళ్లడంపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మోడీ టూర్ ముగిసాక విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  • 03 Jul 2022 01:31 PM (IST)

    ప్రధాని మోడీ సమక్షంలో నేడు బీజేపీలో కొండా చేరిక..

    ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకొనున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

    2014 లో టిఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి

    2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొండా

    2021లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి తటస్థంగా ఉన్న కొండా

    హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు మద్దతు తెలిపిన కొండా

    ముచ్చటగా మూడో కండువా కప్పుకోనున్న కొండా

  • 03 Jul 2022 01:29 PM (IST)

    తెలంగాణ నేతలతో అమిత్ షా, నడ్డా భేటీ..

    తెలంగాణ నేతలతో కాసేపట్లో ప్రత్యేకంగా సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

    సాయంత్రం బహిరంగ సభ, కేసీఆర్ వ్యాఖ్యలు, ఎలాంటి కౌంటర్ ఇస్తే బాగుంటది అనే విషయాలపై చర్చించనున్న నేతలు

  • 03 Jul 2022 01:05 PM (IST)

    మోడీ భద్రత మాకు చాలా ముఖ్యం.. పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

    * మోడీ భద్రత మాకు చాలా ముఖ్యం.. పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి

    * స్టేట్ ఇంటలిజెన్స్ పోలీసులు భద్రత కోణంలో కచ్చితంగా ఉంటారు.

    * కేంద్రమంత్రులు అందరూ ఉన్నారు అందరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం పోలీసులపై ఉంటుంది.

    * బీజేపీ నాయకులు పాకిస్తాన్, మతాలు అని అనేక మాటలు మాట్లాడతారు.

    * రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళను ఎప్పటికప్పుడు కనిపెట్టే భాద్యత ఇంటిలిజెన్స్ కు ఉంటుంది.

    * అందుకే వారు వెళ్లారంటూ పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తెలిపారు.

  • 03 Jul 2022 01:02 PM (IST)

    తీర్మానాన్ని బలపరిచిన సీఎంలు..

    అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం పైన సుదీర్ఘ చర్చ నిర్వహించారు. ఈ తీర్మానాన్ని అస్సాం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మ, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై బలపరిచారు.

  • 03 Jul 2022 01:00 PM (IST)

    అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం పైన సుదీర్ఘ చర్చ

    - అమిత్ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం పైన సుదీర్ఘ చర్చ

    - తీర్మానాన్ని బలపరిచిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మ, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై

    - వెస్ట్ బెంగాల్ , తెలంగాణ లో బిజెపి అధికారం లోకి వస్తుంది: అమిత్ షా

    - రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

  • 03 Jul 2022 12:00 PM (IST)

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్టేట్ ఇంటిలిజెన్స్ పోలీసులు

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో స్టేట్ ఇంటిలిజెన్స్ పోలీసులు

    పట్టుకొని బయటకు పంపించిన ఇంద్రసేనారెడ్డి

    పోటో తీస్తుండగా పట్టుకొని బయటకు పంపిన నాయకులు..

  • 03 Jul 2022 11:32 AM (IST)

    మీడియాకు అనుమతి నిరాకరణ

    పరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభకు పోలీసులు మీడియాకు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రావాలని పోలీసులు మీడియా ప్రతినిధులకు సూచించారు. గేట్ నంబర్ 2 వద్ద మీడియా ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు.

  • 03 Jul 2022 11:28 AM (IST)

    మెట్రో ప్రయాణికులకు అలర్ట్.. ఆ మూడు స్టేషన్లు మూసివేత

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభ జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభకు అగ్రనేతలంతా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. హైదరాబాద్ మెట్రో కూడా ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 వరకు పారడైస్, పరెడ్ గ్రౌండ్, JBS మెట్రో స్టేషన్స్ మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మూడు స్టేషన్స్‌లో మెట్రో ట్రైన్స్ ఆగకుండా వెళ్తాయని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. మోడీ సభ నేపథ్యంలో భద్రతా కారణాలతో దృష్ట్యా మూసివేస్తున్నట్లు తెలిపింది. మిగిలిన స్టేషన్లలో సర్వీసులు యథాతధంగా నడుస్తాయంటూ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులు దీనిని గమనించి తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థించారు.

  • 03 Jul 2022 11:08 AM (IST)

    వంటకాలను పరిశీలించిన బండి సంజయ్‌..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రతినిధులకు తెలంగాణ వంటకాల రుచి చూపించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని సహా ప్రతినిధులకు అందించే వంటకాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిశీలించారు. ఇందుకు సంబంధించి వంటల నిర్వాహకురాలు యాదమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • 03 Jul 2022 10:59 AM (IST)

    చాలా ఆనందంగా ఉంది: యాదమ్మ

    ప్రధాని మోడీకి వంట చేయడం చాలా ఆనందంగా ఉందని యాదమ్మ పేర్కొంది. ఈ అవకాశం ఇచ్చిన బండి సంజయ్‌కు రుణపడి ఉంటానని పేర్కొంది.

  • 03 Jul 2022 10:15 AM (IST)

    ప్రధాని మోడీ సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ..

    - ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ..

    - పెరేడ్ గ్రౌండ్స్ సభకు కనీస ఏర్పాట్లు చేయని బల్దియా.

    - సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు పూర్తి.

    - బీజేపీ నేతల వినతులను తోసిపుచ్చిన జీహెచ్ఎంసీ

    - బీజేపీ నేతలు సమావేశమైనప్పటికీ.. ప్రధాని హాజరవుతున్న పట్టించుకోకపోవడంపై విమర్శలు.

    - పారిశుద్ధ్య నిర్వహణతో పాటు శానిటైజేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలు తీసుకున్న కంటోన్మెంట్.

    - విజయ సంకల్ప సభ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణపై బీజేపీ నేతల ఆగ్రహం..

  • 03 Jul 2022 10:12 AM (IST)

    కేసీఆర్‌వి ఫాల్తు మాటలు: బండి సంజయ్

    కేసీఆర్‌వి ఫాల్తు మాటలంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధానమంత్రిని అవమాన పరుస్తున్నావు ఈ దేశ ప్రజలు నిన్ను క్షమించరంటూ విమర్శించారు. మోడీ సేల్స్‌మెన్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. అవును మోడీ సేల్స్ మేనే.. ప్రజలను ఆదుకోవడంలో, వ్యాక్సిన్ అందించడంలో సేల్స్ మెన్‌గా వ్యవహరించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

  • 03 Jul 2022 10:04 AM (IST)

    రెండోరోజు ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఆదివారం హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధాని మోడీ కీలకోపన్యాసం చేయనున్నారు.

  • 03 Jul 2022 09:32 AM (IST)

    జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చ

    భాగ్యనగరం కాషాయవనమైంది. కమల దండు హైదరాబాద్‌ బాట పట్టింది. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది బీజేపీ. రెండు రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో వర్తమాన రాజకీయ, ఆర్థికాంశాలు, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చ జరగనుంది.

  • 03 Jul 2022 09:30 AM (IST)

    ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

    ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కచ్చితంగా కౌంటర్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగ వేస్తుందని సోము పేర్కొన్నారు.

  • 03 Jul 2022 09:03 AM (IST)

    రాజ్‌భవన్లో నేడు ప్రధాని మోడీ బస..

    విజయ సంకల్ప సభ అనంతరం ప్రధాని మోడీ రాజ్‌‌భవన్‌లో బసచేయనున్నారు. ప్రసంగం అనంతరం మోడీ రోడ్డు మార్గాన రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 03 Jul 2022 08:25 AM (IST)

    మరికాసేపట్లో ప్రారంభం కానున్న సమావేశాలు..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

  • 03 Jul 2022 08:00 AM (IST)

    అమ్మవారికి మహా హారతి

    సీఎం యోగి ఆధిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని మహా హారతి కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.

  • 03 Jul 2022 07:56 AM (IST)

    సీఎం యోగికి పూర్ణకుంభంతో స్వాగతం

    భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న సీఎం యోగికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

  • 03 Jul 2022 07:55 AM (IST)

    భాగ్యలక్ష్మి అమ్మవారికి సీఎం యోగి పూజలు..

    భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అమ్మవారిని దర్వించుకున్నారు.

  • 03 Jul 2022 07:53 AM (IST)

    పాతబస్తీకి చేరుకున్న సీఎం యోగి..

    చార్మినార్‌ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నోవాటెల్ నుంచి చార్మినార్ చేరుకున్నారు. ఆయన వెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. పాతబస్తీలో సీఎం యోగి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

  • 03 Jul 2022 07:39 AM (IST)

    ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్

    భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ ఆలయం దగ్గరికి చేరుకున్నారు. యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

    Bhagyalakshmi Temple

    Bhagyalakshmi Temple

  • 03 Jul 2022 07:35 AM (IST)

    నోవాటెల్ నుంచి బయలుదేరిన సీఎం యోగి

    చార్మినార్‌ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నోవాటెల్ నుంచి బయలుదేరారు. ఆయన వెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.

  • 03 Jul 2022 07:32 AM (IST)

    హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు

    సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

    HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నివారించాలని… టివోలి X రోడ్ నుంచిప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

  • 03 Jul 2022 07:30 AM (IST)

    బీజేపీ దిగ్గజాలకు యాదమ్మ చేతి వంటకాలు

    - బీజేపీ దిగ్గజాలకు యాదమ్మ చేతి వంటకాలు

    - తెలంగాణ వంటల రుచి చూపించబోతున్న యాదమ్మ

    - దాదాపు 50 రకాల వంటకాలను తయారీలో నిమగ్నం

    - నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి పొందుతున్నా.. అవకాశం కల్పించిన బండి సంజయ్ కు రుణపడి ఉంటా: యాదమ్మ

  • 03 Jul 2022 07:29 AM (IST)

    బీజేపీ జాతీయ నేతలకు తెలంగాణ వంటకాలు..

    బీజేపీ జాతీయ నేతలను తెలంగాణ రుచులతో మైమరపించేలా చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. తెలంగాణ సాంప్రదాయక వంటలతో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘుమ ఘుమలాడుతున్నాయి. తెలంగాణ స్పెషల్‌ వంటకాలకి తోడు వివిధ రాష్ట్రాలనుంచి విచ్చేస్తోన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానికి సంపూర్ణ విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది స్థానిక బీజేపీ.

  • 03 Jul 2022 07:27 AM (IST)

    పాతబస్తీలో భారీ బందోబస్తు..

    - పాత బస్తీ లో భారీ బందోబస్తు ఏర్పాటు

    - మరికాసేపట్లో భాగ్యలక్ష్మి ఆలయానికి యూపీ సీఎం యోగి రానున్నారు.

    - యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువు పోలీసుల నిఘా

    - భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టు 500 మీటర్ల రెడియస్‌లో వలయం ఏర్పాటు

    -హెచ్ఐసిసి నుంచి 7:30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకోనున్న యోగి.

  • 03 Jul 2022 07:09 AM (IST)

    నేడు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ

    నేడు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అంనతరం సాయంత్రం లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

  • 03 Jul 2022 07:02 AM (IST)

    నేడు ప్రసంగించనున్న ప్రధాని మోడీ

    బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మధ్యాహ్నం ప్రసంగించనున్నారు. పార్టో బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్‌ రాగానే మోదీ ట్వీట్‌ చేశారు.

  • 03 Jul 2022 07:01 AM (IST)

    నేటితో ముగియనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు..

    బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఆదివారం రెండో రోజు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4.30 గంటలకు ముగియనున్నాయి. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాల్లో భాగ్యనగర్‌ డిక్లరేషన్‌ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది.

  • 03 Jul 2022 06:59 AM (IST)

    మరికాసేపట్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం యోగి

    చార్మినార్‌ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బీజేపీ నేతలు తరలివస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన పలువురు ముఖ్య నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆలయానికి ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. షెడ్యూల్ ప్రకారం నిన్నే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ఆదిత్య నాథ్ సందర్శించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. ఉదయం యోగితోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Published On - Jul 03,2022 6:34 AM

Follow us