AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీదర్ టు హైదరాబాద్.. పల్సర్ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా..

హైదరాబాద్‌ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పల్సర్ బైక్, పది తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

బీదర్ టు హైదరాబాద్.. పల్సర్ బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా..
Crime News
Noor Mohammed Shaik
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 14, 2025 | 12:55 PM

Share

హైదరాబాద్‌ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పల్సర్ బైక్, పది తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ వివరించారు. ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన కిరణ్ పటేల్, అతని స్నేహితుడు రాంశెట్టి పల్సర్ బైక్‌పై తిరుగుతూ ఉదయం పూట ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి పూట ఇళ్లపై దృష్టి సారించి దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. ఈ ఇద్దరూ ఇప్పటి వరకు మేడిపల్లి, జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు దొంగతనాల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు.

వీరు గతంలో సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులో జైలుశిక్ష అనుభవించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. తాజాగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య టౌన్‌షిప్‌లో జరిగిన ఒక దొంగతన కేసులో ఈ ఇద్దరూ నిందితులుగా ఉన్నారు. వారు దొంగతనం చేసిన బంగారు, వెండి ఆభరణాలను బీదర్‌కు చెందిన అశోక్ అనే మరో వ్యక్తికి అప్పగించేవారని, అతను ఆ ఆభరణాలను డిస్‌పోస్ చేసి వచ్చిన డబ్బులో వారికి వాటా ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా దొంగతనం చేసిన ఆస్తులను అశోక్ ద్వారా విక్రయించి, అతనికి కమీషన్ ఇచ్చే వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారని విచారణలో బయటపడింది.

బాలాపూర్ పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పల్సర్ బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని అనుమానం వచ్చి ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలపై ప్రశ్నించగా.. భయంతో సరైన విధంగా సమాధానం చెప్పలేదు.. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో వారు పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

దీంతో వారి వద్ద ఉన్న పల్సర్ బైక్, పది తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ నిందితులు అంతర్రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. వీరిని పట్టుకోవడంతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పలు దొంగతన కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. దొంగలను పట్టుకోవడంలో క్రమంగా వాహన తనిఖీలే ముఖ్య పాత్ర పోషించాయని తెలిపారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు సుధాకర్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..