మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? అడవి నుండి జనారణ్యంలోకి.. దేవుజీ ఇంటర్వ్యూలో విస్తుపోయే నిజాలు!
మావోయిస్ట్ అగ్రనేత దేవుజీ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టిస్తోంది. సాయుధ పోరాటం నుండి ప్రజాస్వామ్య వేదికల వైపు పార్టీ మళ్లుతోందనే సంకేతాలను ఆయన ఇచ్చారు. ముఖ్యంగా 'ఆపరేషన్ కగార్' ఒత్తిడి, క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో అడవిని వదిలి జనారణ్యంలోకి, మైదాన ప్రాంతాల సమస్యలపై చట్టబద్ధమైన పోరాటం చేస్తామని ఆయన ప్రకటించడం ఒక భారీ వ్యూహ మార్పు. 'లొంగుబాటు' అనే పదాన్ని తిరస్కరిస్తూనే, తెలంగాణ పోలీసుల తీరుపై సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. భవిష్యత్తులో మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ విభాగంగా రూపాంతరం చెంది, భూమి, ఉపాధి వంటి మౌలిక సమస్యలపై 'లీగల్ ఫ్రేమ్వర్క్'లో పోరాడే అవకాశం ఉందని దేవుజీ వెల్లడించిన నిజాలు ఉద్యమ భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.

అడవి నుండి జనారణ్యంలోకి వ్యూహ మార్పు?: దేవుజీ మాటల్లో స్పష్టంగా వినిపించిన అంశం – క్షేత్ర మార్పు. నిన్నటి వరకు అడవిని నమ్ముకుని సాయుధ పోరాటం చేసిన అగ్రనేతలు, ఇప్పుడు పట్టణ, మైదాన ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల మీద.. అంటే పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలకు సంబంధించిన మౌలిక సమస్యల మీద ప్రజలను కూడగడతాం అని ఆయన ప్రకటించడం ఒక భారీ వ్యూహ మార్పుగా భావించవచ్చు. టీవీ9 ప్రతినిధి విజయ్తో దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇంటర్వ్యూ లో చాలా అంశాలు బయట పడ్డాయి.. గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రస్తుత సంక్షోభం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన విస్తుపోయే నిజాలను వెల్లడించారు.
ఆపరేషన్ కగార్, అనివార్య అరెస్ట్:
ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్న ‘ఆపరేషన్ కగార్’ పార్టీని ఎంతగా ఇబ్బంది పెడుతుందో దేవుజీ మాటల్లో ధ్వనించింది. నేను అరెస్ట్ అయిన స్థితిలో అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇది కేవలం ఒక వ్యక్తి నిర్ణయమా లేక పార్టీలో వస్తున్న అంతర్గత మార్పా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ పోలీసులపై సానుకూలత:
గతంలో ఇతర రాష్ట్రాల్లో మావోయిస్ట్ నేతలను పోలీసులు చూసిన విధానంపై దేవుజీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అనేక రాష్ట్రాల్లో నేతలను అవమానపరిచారు. ఫాసిస్ట్ పద్ధతులు అనుసరించారు. దాని ఫలితమే ఈ యుద్ధం రగిలిపోయి దీర్ఘకాలం కొనసాగింది. అని ఆయన విశ్లేషించారు. అయితే, తెలంగాణ పోలీసుల విషయంలో ఆయన సానుకూలంగా స్పందించడం, భవిష్యత్తులో ప్రభుత్వంతో చర్చలకు లేదా ప్రజాస్వామ్య మార్గంలోకి రావడానికి ఒక సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
లొంగుబాటుఅనే పదానికి అభ్యంతరం ఎందుకు?:
సాధారణంగా ఏ అగ్రనేత దొరికినా పోలీసులు లొంగుబాటు (Surrender) అని ప్రకటిస్తారు. కానీ, దేవుజీ దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు ..రాజకీయ జీవితాన్ని వదిలేసి, ఇంట్లో కూర్చుంటేనే అది లొంగుబాటు అని, కానీ తాము ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తున్నాం. కాబట్టి అది ‘అరెస్ట్’ మాత్రమేనని ఆయన వాదించారు. ఇది పార్టీ కార్యకర్తల్లో స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు ఆయన అనుసరిస్తున్న వ్యూహంలా కనిపిస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
ప్రజా సమస్యలపై ‘లీగల్ ఫ్రేమ్వర్క్’ పోరాటం:
ముఖ్యంగా భూ సమస్యలు, ఉపాధి, గిరిజనుల హక్కుల వంటి మౌలిక సమస్యలపై ఇకపై చట్టబద్ధమైన పోరాటాలు (Legal struggles) చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ విభాగంగా మారే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం సానుకూలంగా ఉండటం భవిష్యత్తు రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలకవచ్చు.
రాజకీయ అరంగేట్రంపై సంకేతాలు:
మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీ రూపంలో ప్రజల ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం సానుకూలంగా ఉంది. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడానికి చట్టబద్ధమైన ఏ వేదికనైన ఉపయోగించుకుంటామని, ప్రజలను సంఘటితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టీవీ 9 ఇంటర్వ్యూ ద్వారా దేవుజీ ఒక విషయాన్ని స్పష్టం చేశారు. మావోయిస్ట్ ఉద్యమం ఆగిపోలేదు. అది కేవలం తన రూపాన్ని మార్చుకుని సరికొత్త ప్రజాస్వామ్య వేదికలపైకి వస్తోంది.




