AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణం తీసిన వేగం.. కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు.. తండ్రికొడుకులు మృతి

మైలార్ దేవులపల్లి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో యూపీకి చెందిన ప్రభు మహారాజ్‌, ఆయన కుమారుడు దీపక్‌ మృతి చెందారు. మరో వ్యక్తి సత్తునాథ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Hyderabad: ప్రాణం తీసిన వేగం.. కారుతో ఢీకొట్టి పరారైన బౌన్సర్లు.. తండ్రికొడుకులు మృతి
Hyderabad
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Dec 17, 2025 | 12:00 PM

Share

హైదరాబాద్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ఇన్నోవా వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఈవెంట్ ముగించుకుని ఇన్నోవా వాహనంలో వెళ్తున్న బౌన్సర్లు ఈ ప్రమాదానికి కారణమయ్యారని సమాచారం. శంషాబాద్‌ నుంచి వేగంగా వస్తూ దుర్గా నగర్ చౌరస్తా వద్ద అదుపు తప్పి వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో వాహనం అత్యధిక వేగంతో ఉన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు మైలార్ దేవులపల్లి రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఈ ఘటనలో ముగ్గురు బౌన్సర్లు పరారీలో ఉండగా, మరో ముగ్గురు బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బౌన్సర్లంతా సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పరారీలో ఉన్న బౌన్సర్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మద్యం సేవించి వాహనం నడిపారా? లేక నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నట్లు పోలీసులు వెల్లడించారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.