Hyderabad: హైస్పీడ్ దూసుకొచ్చిన మృత్యువు.. క్షణాల్లో గాల్లో కలిసిన ప్రాణం!
హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. శంషాబాద్ ORR పై గార్డెనింగ్ పనులు చేస్తున్న ఓ కార్మికుడిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్నారు. ప్రమాదానికి గురైన కారును గుర్తించేందుకు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై శుక్రవారం ఉదయం గార్డెనింగ్ పనులు నిర్వహిస్తున్న నవీన్ రాజు అనే కార్మికుడిని వేగంగా దూసుకొచ్చిన కియా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ రాజుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన తోటి గార్డెనింగ్ కార్మికులు ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒఆర్ఆర్పై ఆందోళనకు దిగారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న తోటి కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు నిరాకరించారు. గార్డెన్ కాంట్రాక్టర్ వెంటనే ఇక్కడికి వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఏళ్లుగా ఓఆర్ఆర్పై ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ తమకు ఎలాంటి రక్షణ లేదా భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్పై మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలు తమ ప్రాణాలను తీస్తున్నాయని, కాంట్రాక్టర్ కనీసం ఇన్సూరెన్స్, గుర్తింపు కార్డులు, సరైన వేతనాలు కూడా ఇవ్వకుండా శ్రమను దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంట్రాక్టర్ వచ్చి తమ సమస్యలపై భరోసా ఇచ్చి, మృతుని కుటుంబానికి పూర్తి న్యాయం చేసే వరకు కదిలేది లేదని కార్మికులు స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి, ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
