Congress: రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ.. పొందుపరిచిన అంశాలివే..
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మళ్ళీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని కోరారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని విమర్శించారు.
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. మళ్ళీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని కోరారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని విమర్శించారు. ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా రుజువైందని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇస్తున్నారన్నారు. దీంతో పాటు పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2004, 2009లో హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి అప్పుడు ఇచ్చిన హామీలు వేటిని అమలు చేయలేదని విమర్శించారు. 2023 లో కూడా తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అన్ని హామీలను విస్మరించారన్నారు. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? అని నిలదీశారు.
6 గ్యారంటీల పేరుతో మహిళలు, రైతులు, పేదలకు ఇచ్చిన హామీలే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మాది గ్యారెంటీ అని ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్గే ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. కానీ హామీలేవి తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలందరికీ నెలకు రూ.2,500 చొప్పున బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు. కానీ నేటి వరకు ఒక్క మహిళకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందలేదన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. రైతులను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దగా చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎకరానికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. కానీ నేటి వరకు ఈ విధానంపై నిర్ణయమే తీసుకోలేదని గుర్తు చేశారు. ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అది కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ. 4వేల రూపాయల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. ఇవన్నీ ఎప్పటి నుంచి అమలు అవుతాయో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..