Kamareddy: కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ మంటలు.. బంద్కు పిలుపునిచ్చిన రైతు జేఏసీ..
కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్ మంటలు పుట్టించింది. ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్ ముట్టడితో టెన్షన్ టెన్షన్..
కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్ మంటలు పుట్టించింది. ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్ ముట్టడితో టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. కన్నెర్రజేసిన రైతుల నిరసన చివరకు రాజకీయ రంగు పులుముకుంది.
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు కదంతొక్కారు. దీంతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పెద్ద సంఖ్యలో రైతులు, వాళ్ల కుటుంబసభ్యులు తరలిరావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించిన రైతులు ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లారు. గేటుకు వేసిన తాళం తొలగించారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. తోపులాటలో ఇద్దరు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోగా, మరో రైతుకు గాయాలయ్యాయి. ఓ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రైతులకు మద్దతు పలికిన బీజేపీ వారితో పాటు ఆందోళనలో పాల్గొంది. ప్రతిపాదిత రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి తక్షణమే తొలగించాలన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ధర్నాపై స్పందించిన లోకల్ ఎమ్మెల్యే సురేందర్.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని.. వాళ్ల ట్రాప్లో రైతులు పడొద్దన్నారు.
ఎట్టకేలకు స్పందించిన కలెక్టర్..
రైతుల ఆందోళనలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎట్టకేలకు స్పందించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దనీ.. రైతుల భూములు ఎక్కడికీ పోవంటున్నారు. కొందరు కావాలనే సమస్యను క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. 500 మంది వచ్చి వినతిపత్రం ఇస్తా అంటే ఎలా.. పది మంది వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. మాస్టర్ ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వొచ్చని.. వాటిపై చర్చించి కౌన్సిల్ తీర్మానం తర్వాత ఫైనల్ డ్రాప్ట్ చేస్తామంటున్నారు కలెక్టర్ పాటిల్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు.
కామారెడ్డి బంద్కు రైతు జేఏసీ పిలుపు..
గంటలకొద్ది కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసినా కలెక్టర్ స్పందించకపోవడంపై రైతులు మండిపడ్డారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ దిష్టి బొమ్మను గేటుకు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. చివరకు కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతిపత్రం ఇచ్చి తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అలాగే శుక్రవారం కామారెడ్డి బంద్కు పిలుపునిచ్చింది రైతు జేఏసీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..