Hyderabad: ప్రతి ఓటు.. ప్రజాస్వామ్య బలోపేతానికి ఆయువు పట్టు.. జూబ్లీహిల్స్లో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు
Hyderabad: ఓటు ప్రాధాన్యతను వివరించడం, ఓటింగ్ శాతం పెంచేలా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వీప్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యెల్లారెడ్డిగూడ శ్రీ శారద మహిళా డిగ్రీ కాలేజీలో ఓటరు అవగాహన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసి బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా తేలడంతో నియోజకవర్గ పరిధిలో ఓటు ప్రాధాన్యత వివరిస్తూ, ఓటింగ్ శాతం పెంచేలా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈసీ అధికారులు. ఇందులో భాగంగానే యువతలో ప్రజాస్వామ్యంపై చైతన్యం పెంచి, బాధ్యతాయుత ఓటర్లుగా మారేందుకు ప్రేరణ కల్పించడమే లక్ష్యంగా..జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యెల్లారెడ్డిగూడ శ్రీ శారద మహిళా డిగ్రీ కాలేజీలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు. విద్యార్థులకు కొత్త ఓటరు నమోదు, ఓటరు ఐడీ సవరణలు, వోటర్ హెల్ప్లైన్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీపాట్ ప్రదర్శనలతో పారదర్శక ఓటింగ్ విధానాలపై విశ్వాసం పెంచారు. అలాగే సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల నియమాల ఉల్లంఘనలను ఎలా నివేదించాలో వివరించారు.
ఇందులో భాగంగానే వైకుంఠపాళి ఆట ద్వారా ప్రజాస్వామ్య ప్రాధాన్యతను సృజనాత్మకంగా యువతకు ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఈ ఆటలో ప్రతి మెట్టు బాధ్యతాయుత ఓటును సూచిస్తూ “ప్రతి ఓటు మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని.. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలనే అనే సందేశం విద్యార్థులకు అందించారు. చివరగా విద్యార్థులచే “ఓటరు ప్రతిజ్ఞ” స్వీకరించి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఉద్బోధించారు.
ఇలాంటి స్విప్ కార్యక్రమాలు.. యువత, తొలి సారి ఓటు వేయబోయే విద్యార్థుల్లో చైతన్యం పెంచడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. స్వీప్ కార్యక్రమాలు ఓటు శాతం పెరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి పౌరుడు చైతన్యవంతమైన ఓటరుగా మారాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
