Droupadi Murmu: యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇప్పటి వరకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నలుగురు రాష్ట్రపతులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తున్నారు. పలు దేవాలయాలు, వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె..

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తున్నారు. పలు దేవాలయాలు, వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె.. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు యాదాద్రికి చేరుకోనున్నారు. 10 గంటల నుంచి అరగంటపాటు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ద్రౌపది ముర్ము రాక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాట్లు చేశారు. కొండపై మూడు హెలిప్యాడ్లను సైతం సిద్ధం చేశారు అధికారులు. రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సుమారు 1200 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా కొండపై భక్తుల వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఐదో రాష్ట్రపతిగా నిలువనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించి, రాష్ట్రపతికి ఆశీర్వచనం చేస్తారు. స్వయంభూ దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో రాష్ట్రపతికి చతుర్వేద ఆశీర్వచనం చేయనున్నారు.
ఇక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర కళ్లకు కనిపించేలా దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ను ప్రధానాలయ మాఢవీధులోని అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఆలయ చరిత్రను రాష్ట్రపతికి వివరించనున్నారు.



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి