ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. 3 నెలల పసికందు చెయ్యి తొలగించిన వైద్యులు! ఏం జరిగిందంటే
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల చిన్నారి వికలాంగుడుగా మారాడు. 3 నెలల శిశువుకు రక్తం ఎక్కించే సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్ లా అమర్చిన ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో చివరికి శిశువు చేయి పూర్తిగా తొలగించారు. ఇపుడు పసిబాలుడుడు వికలాంగుడు గా మారాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

ఖమ్మం, మే 31: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది విధి నిర్వహణలో చేసిన నిర్లక్ష్యం ఓ పసివాడి జీవితం పాలిట శాపమైంది. నెలలు నిండక ముందే ఈ లోకంలోకి వచ్చిన ఓ పసికందు అంగవైకల్యానికి కారణమైంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు చేతికి ఇన్ఫెక్షన్ జరిగి చివరికి ఆ చెయ్యిని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఖమ్మం ప్రభుత్వ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన తలపాటి రేణుక, సత్యకాంత్ దంపతులు. ఏడు నెలల గర్భిణి అయిన రేణుక నెలలు నిండక మునుపే గత మార్చి3న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది. ఇందులో ఓ పిల్లాడు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉండగా, మరో బాబు కిలో 200 గ్రాముల బరువుతో పుట్టాడు. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. తక్కువ బరువుతో పుట్టిన శిశువు మార్చి 4న ఖమ్మం ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో చేర్చారు.
ఓ పిల్లాడితో రేణుక తాను ప్రసవించిన ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉండిపోగా.. రేణుక బంధువు చిర్రా విజయకుమారి మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఉంచిన చిన్నారిని చూసుకున్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో పసికందును ఇంక్యుబేటర్లో ఉంచిన వైద్య సిబ్బంది చికిత్స అందించారు. ఈ క్రమంలో పలుమార్లు రక్తంఎక్కించారు. అయితే, చికిత్స అనంతరం రక్తం ఎక్కించేందుకు పిల్లాడి ఎడమ చేతికి కాన్యులా పెట్టారు. తర్వాత చిన్నారి కాన్యూలా పెట్టిన ప్రాంతంలో వాపు చేసింది. వాపును గమనించిన విజయకుమారి విషయాన్ని డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లగా దానికేం కాదులే” అని ఓ ఆయింట్మెంట్ రాసి సరిపెట్టారు. మూడు రోజులు గడిచినా వాపు తగ్గకపోగా, చేయి నల్ల బడడం మొదలైంది. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా.. ప్రైవేటులో స్కానింగ్ తీయించుకుని రండి. ‘అంటూ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
అయితే, శిశువు చెయ్యిలో కదలిక లేదని, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, కణజాల క్షీణత బారిన పడి శిశువు చెయ్యి దెబ్బతిందని స్కానింగ్ రిపోర్టులద్వారా తేలింది. దీంతో మాతా శిశు సంరక్షణ కేంద్రం వైద్య సిబ్బంది.. సాధారణ వాపేనని, శిశువు హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తే అక్కడి వైద్యులు నయం చేస్తారని నమ్మబలికి మార్చి 26వ తేదీ రాత్రి ఆ పసికందును అంబులెన్స్ లో హైదరాబాద్కు పంపించేశారు. శిశువును పరీక్షించిన నీలోఫర్ వైద్యులు.. ఇన్ఫెక్షన్ బాగా వ్యాపించిందని, చెయ్యిని పూర్తిగా తొలగించాలని చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శిశువు చేతిని తొలగించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో నీలోఫర్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి శిశువు ఎడమ చెయ్యిని భుజం వరకు తొలగించారు. ఖమ్మం ఎంసీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారిని అంగవైకల్యానికి గురి చేసిందని తల్లి దండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు . ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
