Telangana: జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మార్చాడు.. తీరా రీడింగ్ చూసి కళ్లు బైర్లు కమ్మాయ్
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఓ దినసరి కూలికి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

వనపర్తి జిల్లాలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్ ఓ నిరుపేద కూలి. భార్య, భర్తలు ఇద్దరూ కూలీ పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండు రూములతో ఓ నివాస గృహం ఉంది. ప్రతినెలా ఈ నివాసానికి సుమారు రూ.200 కరెంట్ బిల్లు వస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన గృహజ్యోతి పథకానికి అర్హులైనప్పటికీ గతంలో బిల్లు పెండింగ్ ఉండడంతో అమలు కావడం లేదు. దీంతో విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా పెండింగ్లో ఉన్న బిల్లు కట్టి మీటర్ మార్చుకోవాలని సూచించారు. దీంతో రూ.813 పెండింగ్ బిల్లును చెల్లించాడు.
అనంతరం కరెంట్ మీటర్ మార్పించాడు. నెల తిరిగి చూసేసరికి జీరో వస్తుందని పెట్టించిన కరెంట్ మీటర్ వెంకటేష్ను అవాక్కు గురి చేసింది. ఏకంగా రూ.7122 బిల్లు జనరేట్ కావడంతో లబోదిబోమంటున్నాడు వెంకటేష్. కూలీ పనిచేసుకుని బతికే తాను ఇంత బిల్లు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నాడు. అయితే విషయం విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే చేస్తాం.. చూస్తాం.. అనే సమాధానాలు చెబుతున్నారని వెంకటేష్ చెబుతున్నాడు. నిరుపేదనైన తనకు అధిక బిల్లు విషయంలో సరైన న్యాయం చేయాలని.. గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేయాలని వేడుకుంటున్నాడు.




