CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
ఏఐసీసీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఐపీఎస్ల సంఖ్య పెంపు.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం ఏఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, రాహుల్ యాత్రపై దిశానిర్దేశం చేశారు మల్లిఖార్జున ఖర్గే. ఈ సమావేశం అనంతరం ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్తో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు సీఎం రేవంత్. ఈ సమావేశంలో సీఎస్ శాం తికుమారితో పాటు హెచ్ఎండీఏ జాయింట్ డైరెక్టర్ అమ్రపాలి కూడా పాల్గొన్నారు. ప్రధానంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్లతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సాయం చేయాలని కోరారు సీఎం రేవంత్.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. ఐపీఎస్ కేడర్ అధికారుల సంఖ్యను పెంచాలని కోరినట్టు సమాచారం. అలాగే విభజన అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి కూడా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిన రేవంత్.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్ట్కి వేరే స్కీమ్ కింద ఫండిగ్ చేస్తామని షెకావత్ హామీ ఇచ్చారన్నారు మంత్రి ఉత్తమ్.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎంతో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు కూడా ఢిల్లీ వెళ్లారు. వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన సాయం, నిధుల విడుదలపై విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..