AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణకు అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. ఆదివారం(సెప్టెంబర్ 1) ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో భారీ వర్షాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితిపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

Telangana: భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. తెలంగాణకు అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
Ndrf Teams
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Sep 01, 2024 | 7:44 PM

Share

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు. ఆదివారం(సెప్టెంబర్ 1) ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలో భారీ వర్షాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరిస్థితిపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపుకు గురవడంతోపాటు పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరాతండ గుట్టపైన 68 మంది, బిల్డింగులపైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు వివరించారు. వెంటనే స్పందించిన అమిత్ షా తెలంగాణకు అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను ఆదేశించారు.

అనంతరం బండి సంజయ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఫోన్ లో మాట్లాడుతూ అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అట్లాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వర్షాల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులతోపాటు కొనసాగుతున్న సహాయక చర్యలపైనా బండి సంజయ్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలు, నాయకులంతా జాగ్రత్తగా ఉంటూనే అధికారులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.

మరోవైపు భారీవర్షాలతో వరంగల్‌-మహబూబాబాద్‌ రహదారిపై వరద పోటెత్తింది. దీంతో తోపనపల్లి దగ్గర వరదలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. ప్రయాణికుల ఆర్తనాదాలతో స్పందించిన పోలీసులు..వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారిని తోపనపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు-సత్యనారాయణపురం మధ్య కల్వర్టును దాటే ప్రయత్నంలో పాషా అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహంలో చెట్టును పట్టుకొని ఉన్న బాధితుడిని అతికష్టంపై రక్షించారు స్థానికులు. ఖమ్మం పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది. సాయి కృష్ణనగర్‌లోని అపార్ట్‌మెంట్లలో రెండో అంతస్తువరకూ వరద నీరు చేరింది. దీంతో స్థానికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గొర్రెలను మేపేందుకు తీసుకువెళ్లిన కాపరులు అందులో చిక్కుకున్నారు. దీంతో గ్రామస్తులు స్పందించి బాధితులను కాపాడారు. అయితే 150 పైగా గొర్రెలు, మేకలు వాగులో కొట్టుకుపోయాయి. తమ జీవనాధారం పోవడంతో బోరున విలపించారు బాధితులు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. శనిగపురంలో ఊర చెరువు అలుగు పారడంతో గ్రామస్తులు చేపలవేటలో మునిగి తేలుతున్నారు.

పెద్దపల్లి జిల్లా నక్కల వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-కొత్తపల్లి మధ్య ప్రవహిస్తున్న వాగులో కాల్వ శ్రీరాంపూర్ బిల్ కలెక్టర్ పవన్ గల్లంతయ్యాడు. మరో వ్యక్తిని స్థానికులు కాపాడారు. నారాయణపేట జిల్లా ఊట్కుర్ మండలంలోని పగిడిమారీ వద్ద వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు స్థానికులు. నారాయణపేట పట్టణానికి వెళ్లి తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా పగిడిమారీ వాగులో చిక్కుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి. వాగు మధ్యలో ఉన్న ఒక చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతున్న బాధితుడిని గుర్తించిన గ్రామస్తులు..జేసీబీ సహాయంతో తాడు వేసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

నిర్మల్ జిల్లా తానూరు మండలం ఝరి(బి) గ్రామంలో వరదల్లో కొట్టుకుపోతున్న ఆటోను కాపాడారు..గ్రామస్తులు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. స్థానికులు వెంటనే స్పందించడం నలుగురు బాధితులు సురక్షితంగా బయటపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us