Telangana: తెలంగాణలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్న్యూస్
తెలంగాణలో కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల బకాయిలను త్వరలో విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవల రాష్ట్ర అధికారులు ఢిల్లీకి వెళ్లి నిధుల విడుదలపై చర్చించారు. దీంతో కేంద్రం సానుకూలంగా ఉంది.

తెలంగాణలో ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి శుభవార్త. త్వరలో ఇళ్ల నిర్మాణం మళ్లీ మొదలుకానుంది. రాష్ట్రంలోని ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలంగాణలో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం మళ్లీ మొదలుకానుంది. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిధులు ఉపయోగపడనున్నాయి. తెలంగాణలో పూర్తైన డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేంద్రం పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా తన వాటాను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ఈ నిధులను అసంపూర్తిగా మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుని త్వరగా పూర్తి చేయనుంది. వీటిని కొత్త లబ్దిదారులకు అందించేందుకు మార్గం సుగమమైంది.
త్వరలో కేంద్రం నుంచి రూ.564 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇళ్ల బకాయిలు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందనున్నాయి. రూ.564 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర అధికారులు కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను కలిసి బకాయిలు విడుదల చేయలని కోరారు. దీంతో కేంద్రం త్వరలోనే విడుదల చేసేందుకు హామీ ఇచ్చింది. తెలంగాణలో 1.45 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం స్టార్ట్ అవ్వగా.. వీటిల్లో ఇప్పటివరకు 60వేల ఇళ్లు లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఇక మరో 30వేలు పంపిణీకి సిద్ధంగా ఉండగా.. మిగతా ఇళ్లు నిర్మాణంలోనే ఉన్నాయి. నిధుల కొరత వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఆ ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులను అందించనున్నారు. సొత జాగా, సొంత ఇళ్లు లేనివారికి ఈ ఇళ్లను అందించనున్నారు.
రూల్స్ వల్ల ఇబ్బందులు
అయితే పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా నిధులు రావాలంటే.. లబ్దిదారుల పేర్లు, ఇతర వివరాలన్నీ కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ముందు ఇళ్లను పూర్తి చేసి ఆ తర్వాత లబ్దిదారులకు అందించేవారు. ఇళ్లు కేటాయించిన తర్వాతే లబ్దిదారులకు పేర్లను పంపుతారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వేరుగా ఉండటంతో నిధులు అందలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పోర్టల్లో వివరాలు అప్ లోడ్ చేయడంతో కేంద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కేంద్రం ప్రభుత్వం తన వాటాగా లబ్దిదారులకు అందిస్తోంది. దీని వల్ల తెలంగాణలో ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యే అవకాశముంది.
