KCR – BRS: లోక్సభ ఎన్నికలకు సై..! క్లీన్స్వీప్ టార్గెట్గా బీఆర్ఎస్ అడుగులు.. రంగంలోకి కేసీఆర్..
బీఆర్ఎస్ పేరు ఢిల్లీ లెవెల్లో గట్టిగా వినిపించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే సమాధానం ఇవ్వాలి. ఇదీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్. అందుకే, సారు.. కారు.. పదహారు స్లోగన్ మళ్లీ తెరపైకి తేబోతున్నారు. మరి.. టార్గెట్-16 కోసం కేసీఆర్ రచిస్తున్న వ్యూహాలేంటి? ఈసారి అభ్యర్ధులను మారుస్తారా? మారిస్తే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్ధులను సెలెక్ట్ చేయబోతున్నారు?

కనీసం రెండు మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లోక్సభ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు ఏమంత సమయం లేదని కేసీఆర్కు తెలుసు. మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ.. ఈసారి కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తుందన్న సంకేతాలతో గులాబీ బాస్ అలర్టయ్యారు. అందుకే, ఢిల్లీలో ఉన్న 16 మంది బీఆర్ఎస్ ఎంపీలను ఉన్నఫళంగా హైదరాబాద్కు పిలిపించారు. ఒకరి తరువాత ఒకరితో పర్సనల్గా మాట్లాడుతున్నారు. పోగొట్టుకున్న విజయాన్ని తిరిగి దక్కించుకోడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం లోక్సభ ఎన్నికలు మాత్రమే. పైగా గెలుపు తాలూకు సౌండ్ ఐదేళ్ల పాటు రీసౌండ్ వచ్చేలా ఉండాలన్నది గులాబీ బాస్ ప్లాన్.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్ధిగా ఎక్స్పోజ్ చేశారు కేసీఆర్. కాని, పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు. బీజేపీ కూడా ఫోర్స్గా అటాక్ చేస్తుంది. ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఫేస్ చేయాలి. పైగా పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు. ఢిల్లీలో బీఆర్ఎస్ పేరు గట్టిగా వినిపించాలంటే.. తెలంగాణ గల్లీల్లో గట్టిగా కొట్లాడాల్సిందే. అందుకే, వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీపై దాడి మొదలుపెట్టారు. రెండు వారాలైనా కాకముందే.. అటాకింగ్ మోడ్లోకి వెళ్లిపోయారు. పథకాల అమలు ఇంకెప్పుడని ఇరుకునపెట్టే వ్యూహంతో వెళ్తున్నారు. ఇటు పథకాలను అమలుచేస్తూ పాలన కొనసాగించడమా, లేక పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టడమా అనే సందిగ్ధంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లేలా అసెంబ్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. ఆల్రడీ ఆ ప్రక్రియ జరుగుతోంది కూడా.
ప్రధాని పీఠంపై ఎవరు కూర్చోవాలనే అంశమే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే, తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా గట్టిపోటీనిస్తుంది. దీంతో తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండనుంది. అయితే, కాంగ్రెస్-బీజేపీకి చెక్పెడుతూ.. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఎందుకు ఓటు వేయాలో గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే గులాబీ బాస్ ప్రత్యేక ప్లాన్తో రాబోతున్నట్టు చెబుతున్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలకంగా ఉంటుందని ఏనాడో చెప్పారు కేసీఆర్. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందెడ్, నాగ్పూర్, సోలాపూర్ ప్రాంతాల్లో కమిటీలు వేశారు. మరి ఆయా రాష్ట్రాల్లో పోటీ చేస్తారా, సమీకరణాలను మారుస్తారా అనేది బీఆర్ఎస్ అధినేతే రివీల్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ వరకు బీఆర్ఎస్ టార్గెట్ ఒక్కటే. క్లీన్స్వీప్. మరో ఆలోచనే లేదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంటుంది కాబట్టి.. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో 16 సీట్లపై ఫోకస్ పెట్టబోతున్నారు. అంటే, మరోసారి సారు, కారు, పదహారు అనే నినాదాన్ని హైలెట్ చేయబోతున్నారు. పైగా ఈసారి తెలంగాణ నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఆ రాజకీయ వేడి మరో లెవెల్లో ఉంటుంది. ప్రజల అటెన్షన్ కూడా కచ్చితంగా మారిపోతుంది. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే.. మూడ్ మొత్తం బీజేపీ వైపు ఉండొచ్చు. సోనియా పోటీ చేస్తే.. ఆల్రడీ అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్కే ఎక్కువ ఎడ్జ్ ఉండొచ్చు. ఊహాగానాలను నిజం చేస్తూ ఇటు మోదీ, అటు సోనియా.. ఇద్దరూ గనక పోటీ చేసినా.. తెలంగాణలో మాత్రం కచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుంది. సో, కేసీఆర్ వేయబోయే ఎత్తులు, రచించే వ్యూహాలన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకునే చేయాల్సి ఉంటుంది. పైగా పెద్దగా సమయం కూడా లేదు. ఫోకస్ చేయాల్సింది 16 నియోజకవర్గాలే కాబట్టి అంతగా సమయం పట్టకపోవచ్చు. కాని, ఎలక్షన్ మూడ్ను బీఆర్ఎస్ వైపు తిప్పడమే అతిపెద్ద టాస్క్. ఇందుకోసం బీఆర్ఎస్ అధినేత ఏం చేస్తారో చూడాలి. అభ్యర్దులను మార్చకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ లెక్కన ఎంపీ అభ్యర్ధులను కూడా మారుస్తారా, కొత్తవాళ్లకి ఛాన్స్ ఇవ్వదలచుకుంటే ఎవరికి ఇస్తారు, అంత వడపోసే సమయం ఉంటుందా ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. కాని, కేసీఆర్ రాజకీయ ఉద్ధండులు. 119 నియోజకవర్గాలనే వడపోసిన పార్టీ అధినేతకు.. 16 నియోజకవర్గాలు పెద్ద టాస్క్ కాకపోవచ్చు.
ఇక అసలు విషయం.. కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలో దిగుతారు? పార్టీ వర్గాలు గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ చెబుతున్నది మెదక్ పార్లమెంట్ స్థానమే. ఉత్తర తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ.. మెదక్ జిల్లాలో మాత్రం ఫలితాలు సాధించలేకపోయింది. కాంగ్రెస్ హవాను అడ్డుకుంది ఉమ్మడి మెదక్ జిల్లానే కావడంతో దాదాపుగా కేసీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారంటున్నారు. అటు సోనియా గాంధీ పోటీ చేస్తానంటే.. ఫస్ట్ ఆప్షన్ దాదాపుగా మెదక్ ఉండొచ్చంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్కు గట్టి పట్టు ఉన్న మెదక్లో ఇప్పుడు బీఆర్ఎస్ సత్తా చాటుతోంది. సో, కాంగ్రెస్, బీజేపీ ఎంత పెద్ద లీడర్లను తీసుకొచ్చి మెదక్ బరిలో నిలిపినా.. కేసీఆర్ దిగితే మాత్రం కచ్చితంగా బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంటుందంటున్నారు. మరి పోటీ విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది చూడాలి. కేసీఆరే గనక పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగితే.. పార్టీకి అంతకంటే పాజిటివ్ అంశం ఉండదు. పార్టీ శ్రేణులకు కొత్తగా జవసత్వాలు ఇచ్చినట్టే అవుతుంది.
సారు, కారు, పదహారు. ఏదేమైనా, ఎలాగైనా.. సాధించి తీరాలనే కసితోనే ఉన్నారు బీఆర్ఎస్ అధినేత. గెలవాలి. కచ్చితంగా గెలవాలి. గెలిస్తేనే.. పరపతి నిలుపుకున్నట్టు. వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని లైమ్లైట్లో ఉంచాలంటే.. ఆపై వచ్చే మళ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా బీఆర్ఎస్ను నిలపాలంటే వచ్చే లోక్సభ ఎన్నికలే కీలకం. ఇంత ఎక్స్పెక్టేషన్స్ మధ్య కేసీఆర్ రచించబోయే వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..