Hyderabad: 5 రోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడు ఊహించని నిర్ణయం.. అసలేం జరిగిందంటే..?
ఐదు రోజుల్లో పెళ్లి.. అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన చేతులే.. కానరాని లోకాలకు వెళ్లిన ఆ యువకుడికి కన్నీటి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. గచ్చిబౌలిలో పెళ్లి సందడి ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. పెళ్లి కూతురి కలలు, తల్లిదండ్రుల ఆశలు ఆవిరవుతూ.. యానిమేషన్ కంపెనీ యజమాని వెంకటకృష్ణ ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్లోని గచ్చిబౌలిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి వేడుకల సందడి నడుమ ఇలాంటి దారుణం జరగడం కుటుంబ సభ్యులను, బంధువులను షాక్కు గురిచేసింది. వెంకటకృష్ణ శ్రీ సాయి అనే యువకుడు పెయిన్ కిల్లర్ మాత్రలు అధికంగా తీసుకుని అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బయటపడిన వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
ఆత్మహత్యకు ముందు వెంకట్ కృష్ణ తన సోదరుడు, కాబోయే భార్యకు మెసేజ్లు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ మెసేజ్లలో తన మనోవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మెసేజ్లు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. వెంకట్ కృష్ణ ఒక యానిమేషన్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వ్యాపార సంబంధిత ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు, ఆత్మహత్యకు గల అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. పెళ్లి కూతురు, కుటుంబ సభ్యుల ఆవేదన చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటున్నారు. జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా వాటికి ఆత్మహత్యే పరిష్కారం కాదని నిపుణులు సూచిస్తున్నారు. కష్టసమయాల్లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడడం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు.
