Hyderabad: ఎయిర్పోర్టులో స్కానింగ్ మిషన్ దాటుతుండగా మోగిన అలారం.. ఆపి చెక్ చేయగా..
ఇటీవల ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులు తీసుకొస్తున్న కొన్ని వస్తువులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రయాణికుడు బ్యాగులో కొతి పుర్రెను పెట్టుకొని రాగ.. తాజాగా ఓ ప్రయాణికుడు బుల్లెట్స్తో అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ల సంచలనం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి చేతి బ్యాగేజ్లో లైవ్ బుల్లెట్లను భద్రతా సిబ్బంది గుర్తించారు. విమానాశ్రయంలోని డిపార్చర్ టెర్మినల్ వద్ద సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా సిఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువులను గమనించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు సదరు బ్యాగ్ను భౌతికంగా తనిఖీ చేసి, అందులో ఉన్న సజీవ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
బుల్లెట్లు లభ్యం కావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కాసేపు కలకలం రేగింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అధికారులు తక్షణమే ఆ ప్రయాణికుడిని విమానం ఎక్కకుండా అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి వద్ద లభించిన బుల్లెట్లకు సంబంధించి ఎలాంటి లైసెన్స్ లేదా అనుమతి పత్రాలు ఉన్నాయా అనే కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. ప్రయాణికుడు సమగ్ర ఆధారాలు చూపించలేకపోవడంతో అతడిని ఆర్జిఐఎ లోకల్ పోలీసులకు అప్పగించారు.
ఎయిర్పోర్టు నిబంధనల ప్రకారం ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకువెళ్లడం తీవ్రమైన నేరం కావడంతో, ఆర్జిఐఎ పోలీసులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ప్రయాణికుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ బుల్లెట్లు అతడి వద్దకు ఎలా వచ్చాయి, పొరపాటున బ్యాగ్లో ఉండిపోయాయా లేక వెనుక ఏమైనా దురుద్దేశం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్పోర్టులలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, ప్రయాణికులు తమ లగేజీ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,
