ఐదేళ్లు పూర్తి చేసుకున్న టీ-హబ్
యుువత తాము వినూత్న ఆలోచనలను ఆవిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అందిస్తోంది..
యుువత తాము వినూత్న ఆలోచనలను ఆవిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అందిస్తోంది.. వినూత్న ఆవిష్కరణలతో వచ్చిన స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన టి-హబ్ ఏర్పాటై గురువారం నాటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. నవంబరు 5, 2015లో ప్రారంభమైన టి-హబ్ దేశంలో అంకుర సంస్థల ఏర్పాటులో కీలక భూమిక పోషించింది. ఇప్పటి వరకూ దాదాపు 1,100 అంకుర సంస్థలు, 430పైగా కార్పొరేషన్లపై టి-హబ్ తన సేవలను అందించింది. దాదాపు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడులు ఈ సంస్థలు ఆకర్షించాయి. ఈ సంస్థలన్నీ కలిపి 15,000లకు పైగా ఉద్యోగాలను సృష్టించాయి.
ఇక, అంకుర సంస్థలు మార్కెట్లోకి వెళ్లడానికి 75 వినూత్న కార్యక్రమాలను టి-హబ్ డిజైన్ చేసింది. అంకుర సంస్థలు తమ వినియోగదారులను సంప్రదించేందుకూ, పెట్టుబడులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వ అన్నిరకాల సదుపాయాలను కల్పిస్తుంది. పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు, పరిశోధన, ప్రభుత్వ సంస్థలు, ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, టై, సీఐఐ, నాస్కాం, హైసియా, డీఎస్టీ, ఎంఐఈటీవై, ఏఐఎం, స్టార్టప్ ఇండియాలాంటి వాటి భాగస్వామ్యంతో స్టార్టప్ సంస్థల అభివృద్ధికి కృషి చేసింది.
టి-హబ్ ఐదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు సిద్ధమవుతున్నారని, వారందరికీ టి-హబ్ ఒక చక్కని వేదికలా ఉపయోగపడుతోందన్నారు. ఉత్సాహం ఉన్నవారిని ప్రోత్సహించి, వారి సంస్థలు విజయవంతం అయ్యేందుకు తోడ్పడుతోందని తెలిపారు. యువతలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందు టి-హబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు టి-హబ్ సీఈఓ రవి నారాయణ్. అంకుర సంస్థల మార్కెట్ విలువను పెంచేందుకు టి-హబ్ విశేష కృషి చేస్తున్నట్లు వివరించారు. ల్యాబ్32 లాంటి కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా ఉన్న అంకురాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. టి-హబ్ చేస్తున్న కృషి ఫలితంగా గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అంకుర సంస్థలు 400 నుంచి 2,000 వరకూ పెరిగాయన్నారు.