Virender Sehwag : కోహ్లీ చెప్పినా నో చెప్పిన సెహ్వాగ్.. టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఎందుకు వదులుకున్నాడో తెలుసా?
Virender Sehwag : టీమిండియా హెడ్ కోచ్ పదవిని వీరేంద్ర సెహ్వాగ్ ఎందుకు తిరస్కరించారో తాజాగా వెల్లడించారు. 2017లో విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధికారులు స్వయంగా అడిగినా ఆయన ఎందుకు నో చెప్పారు? తనకు నచ్చిన సపోర్ట్ స్టాఫ్ను ఎంపిక చేసుకునే అవకాశం లేకపోవడమే అసలు కారణమని సెహ్వాగ్ తెలిపారు.

Virender Sehwag : టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ తాను ఆ ఆఫర్ను ఎందుకు వద్దనుకున్నారో ఆయన వెల్లడించారు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి స్వయంగా వచ్చి అడిగినప్పటికీ, తాను ఆ పదవిని తిరస్కరించడానికి గల అసలు కారణాలను ఆయన వివరించారు.
కోహ్లీ – కుంబ్లే మధ్య వివాదం
ఈ సంఘటన 2017 నాటిదని సెహ్వాగ్ తెలిపారు. ఆ సమయంలో అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తి, ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జూన్ 2017లో కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, బీసీసీఐ నాటి కార్యదర్శి అమితాభ్ చౌదరి తన వద్దకు వచ్చి ప్రత్యేకంగా సమావేశమయ్యారని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నారు. కుంబ్లేతో పరిస్థితులు సరిగ్గా లేవని, కాబట్టి కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని వారు కోరినట్లు వెల్లడించారు.
సపోర్ట్ స్టాఫ్ లభించక పోవడమే కారణం
2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి తాను కామెంటరీ ప్యానెల్లో ఉన్నానని, ఆ టోర్నీ తర్వాత వెస్టిండీస్ పర్యటన నుంచి కోచ్గా బాధ్యతలు స్వీకరించాలనేది ప్లాన్ అని వీరూ తెలిపారు. అయితే తాను ఆ ఆఫర్కు వెంటనే అంగీకరించలేదని చెప్పారు. “నేను అవును అని చెప్పలేదు, అలాగని కాదు అని కూడా అనలేదు. ఒకవేళ నేను కోచ్గా రావాలంటే నాకు నచ్చిన సపోర్ట్ స్టాఫ్ కావాలని స్పష్టంచేశాను. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ నా ఎంపిక ప్రకారమే ఉండాలని కోరాను. కానీ నా ఛాయిస్ ప్రకారం సపోర్ట్ స్టాఫ్ను ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించాను” అని సెహ్వాగ్ తెలిపారు.
సొంత నిర్ణయాలకే సెహ్వాగ్ మొగ్గు
మైదానంలో తన బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను చెండాడే సెహ్వాగ్, మైదానం బయట కూడా అంతే స్పష్టమైన వైఖరితో ఉంటారనేది ఈ సంఘటన నిరూపిస్తోంది. తన ప్రాధాన్యతలకు, జట్టు నిర్వహణ శైలికి తగిన వాతావరణం దక్కకపోవడంతో కోచ్ పదవి వంటి అత్యున్నత బాధ్యతను కూడా సెహ్వాగ్ సునాయాసంగా వదులుకోవడం విశేషం. ఆ తర్వాత రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
