
Anil Kumble IPL Best Teams: భారత మాజీ లెగ్ స్పిన్నర్, కోచ్ అనిల్ కుంబ్లే ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ జట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రకారం ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా పేర్కొన్నాడు. ఈ రెండు జట్లు ఎన్నో టైటిళ్లు గెలుచుకుని లీగ్లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయన్నారు. అయితే ఈ రెండు జట్లలో ఏది మెరుగైనదో చెప్పడం చాలా కష్టం అని కుంబ్లే అభిప్రాయపడ్డారు.
అనిల్ కుంబ్లే మాట్లాడుతూ ఈ రెండు ఫ్రాంచైజీల విజయానికి కారణాలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధానంగా అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఆధారపడే జట్టు. ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్న క్రికెటర్లను జట్టులో కొనసాగిస్తూ స్థిరత్వాన్ని కాపాడుతుంది.
మరోవైపు ముంబై ఇండియన్స్ యువ ప్రతిభను గుర్తించి వారికి అవకాశం ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. ఈ విధానం వల్ల చాలా మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని కుంబ్లే చెప్పారు.
ముంబై ఇండియన్స్ ఎన్నో కొత్త ప్రతిభలను ప్రపంచ క్రికెట్కు పరిచయం చేసింది. అందులో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు ఉన్నాయి. వీరు మొదట ముంబై జట్టులోనే తమ ప్రతిభను నిరూపించి తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో స్టార్లుగా మారారు. అలాగే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా ముంబై ఇండియన్స్ ద్వారా వెలుగులోకి వచ్చారని కుంబ్లే పేర్కొన్నారు.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన విషయంపై కూడా కుంబ్లే స్పందించారు. ఆ విజయం కేవలం విరాట్ కోహ్లీదే కాకుండా మొత్తం జట్టు కృషి ఫలితమని ఆయన అన్నారు. ముఖ్యంగా గత సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం అద్భుతంగా ప్రదర్శించిందని చెప్పారు.
జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు కీలక పాత్ర పోషించగా, స్పిన్ విభాగంలో కృణాల్ పాండ్యా, సుయశ్ శర్మ మంచి ప్రదర్శన చేశారు.
అనిల్ కుంబ్లే అభిప్రాయం ప్రకారం ఐపీఎల్ 2026లో కూడా విరాట్ కోహ్లీని చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వస్తారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీకి ఉన్న అభిమానుల మద్దతు ఎప్పటిలాగే కొనసాగుతుందని ఆయన తెలిపారు. అలాగే బలమైన బౌలింగ్ యూనిట్తో ఆర్సీబీ ఈ సీజన్లో కూడా మంచి ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..